తాంసి, ఏప్రిల్ 11: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ సూచించారు. ఆదిలాబాద్లోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు. నో మాస్క్- నో వెజిటెబుల్ బోర్డు పెట్టాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్ను శుభ్రంగా ఉంచేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్, మార్కెటింగ్ శాఖ అధికారులు ఉన్నారు.
మాస్కు లేకుండా బయట తిరగొద్దు
నార్నూర్, ఏప్రిల్ 11: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్కు లేకుండా బయట తిరగవద్దని నార్నూర్ ఎస్ఐ విజయ్కుమార్ అన్నారు. ఆదివారం దుప్పాపూర్ గ్రామంలో గ్రామస్తులకు కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి రూ.1000 జరిమానా విధించడంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఐచర్ వాహనంలో పెళ్లికి వెళ్తున్న వారికి కొవిడ్ నిబంధనలు వివరించారు. కార్యక్రమంలో ట్రైనీఎస్ఐలు రాధిక, ప్రవళిక పాల్గొన్నారు.
పనులుంటేనే బయటకు వెళ్లాలి
బోథ్, ఏప్రిల్ 11: కరోనా కేసులు పెరుగుతున్నందున అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్లాలని ఎంపీడీవో రాధ సూచించారు. పట్నాపూర్లో గిరిజనులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ పీ సుగుణ, శంకర్, వార్డు సభ్యుడు మోహన్, అంగన్వాడీ టీచర్ సుశీల, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, ఏప్రిల్ 11: మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంతలో గ్రామ పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది ప్రజలకు మాస్కుల వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే సంతలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్యక్రమంలో ఈవో సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
మాస్కు ధరించకుంటే జరిమానా
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 11: మాస్కులు లేకుండా బయట తిరిగితే జరిమానా విధిస్తామని ఎస్ఐ నాగ్నాథ్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని దుకాణాలను తనిఖీ చేశారు. వ్యాపారులకు కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. దుకాణాల ముందు భౌతిక దూరం కోసం ప్రత్యేక బాక్స్లను ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలు పాటించకుంటే దుకాణాలు సీజ్
బేల. ఏప్రిల్ 11: మాస్కులు లేని వారికి ఇప్పటికే రూ.100 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించామని ఇక నుంచి దుకాణాలు సీజ్ చేస్తామని సర్పంచ్ ఇంద్రశేఖర్ వ్యాపారులను హెచ్చరించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ఎస్ఐ సాయన్న, అధికారులతో కలిసి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బేల మండలం మహారాష్ట్ర సమీపంలో ఉన్నందున అందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎస్ఐ మాట్లాడుతూ మాస్కులు లేకుంటే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సమావేశంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఎదులాపురం, ఏప్రిల్ 11: కలెక్టరేట్ చౌరస్తా వద్ద టూటౌన్ ఎస్ఐ విష్ణు ప్రకాశ్ తనిఖీలు చేశారు. మాస్కు ధరించని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి జారిమానా విధించారు. ఎస్ఐ ఊశన్న, కానిస్టేబుళ్లు ప్రభాకర్, దీపక్సింగ్, శ్రీలత పాల్గొన్నారు