Sensex All time record | దలాల్ స్ట్రీట్లో ముందే దీపావళి వచ్చినట్లు కనిపిస్తున్నది. గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్లో ఆల్టైం రికార్డు నెలకొల్పాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో రికార్డు స్థాయిలో 59,957.25 పాయింట్లను తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 958.03 పాయింట్లు (1.63%) లాభ పడి 59,885.36 పాయింట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 18 వేల పాయింట్లకు చేరువలో ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్లో సుమారు 300 పాయింట్లు ర్యాలీతో ఆల్టైం హై రికార్డు 17,843.90 పాయింట్లకు దూసుకెళ్లింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ-50 ఇండెక్స్ 1.57 శాతం లాభంతో 17,822.95 పాయింట్ల వద్ద ముగిసింది.
ప్రస్తుతానికి బాండ్ల కొనుగోలు ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. నవంబర్ ప్రారంభంలో నెలవారీ బాండ్ల కొనుగోళ్లను నిలిపేస్తామని తెలిపింది. ఊహించినదానికంటే ముందే వడ్డీరేట్లు పెంచుతామని సంకేతాలిచ్చింది. దీంతో మార్కెట్లో సెంటిమెంట్ బలపడింది. ఇండెక్స్ హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ దూసుకెళ్లాయి. రిలయన్స్ షేర్ 2.44 శాతం లాభ పడగా, బ్యాంకులు, రియాల్టీ స్క్రిప్ట్లు పైపైకి దూసుకెళ్లాయి. నిఫ్టీ బ్యాంక్ 2.24, నిఫ్టీ-రియాల్టీ ఇండెక్స్ సుమారు 8.66 శాతం లబ్ధి పొందాయి.
5.50 శాతం లబ్ధితో నిఫ్టీలో బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ గెయినర్గా నిలిచింది. తర్వాత హిందాల్కో 4.54, యాక్సిస్ బ్యాంక్ 3.03 శాతం లబ్ధి పొందాయి. ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ స్క్రిప్ట్లు నిఫ్టీలో 1.45-3 % మధ్య లాభ పడ్డాయి.
నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ లైఫ్ భారీగా 1.15 శాతం నష్టపోయింది. రెడ్డీస్ ల్యాబ్స్ 1.06 శాతం, నెస్ట్లే 0.46 శాతం నష్టపోయాయి. ఇంకా ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్యూఎల్ స్టాక్స్ పతనం అయ్యాయి.
మరోవైపు బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.28 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.91 శాతం లాభ పడ్డాయి. బీఎస్ఈలో 1969 షేర్లు లాభ పడగా, 1269 షేర్లు నష్టపోయాయి. 164 స్క్రిప్ట్లు యధాతథంగా కొనసాగాయి. గురువారం మార్కెట్ ముగిసే నాటికి ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్లు దాటింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం ముగిసిన రూ.258.56 లక్షల కోట్ల నుంచి రూ.261.74 లక్సల కోట్లకు దూసుకెళ్లింది.