వచ్చే పదేళ్లలో చేరుకోనుంది: మోతీలాల్ జేఎండీ రామ్దేవ్ అగర్వాల్ అంచనా
న్యూఢిల్లీ: మే 29: దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్నా, స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతున్నాయి. అయితే ఇండియా మార్కెట్ బుల్న్క్రు ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న సంవత్సరాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. వచ్చే పదేళ్లలో బీఎస్ఈ సెన్సెక్స్ ఇప్పటిస్థాయి 51,500 పాయింట్ల నుంచి మరో నాలుగు రెట్లు పెరిగి 2,00,000 పాయింట్లకు చేరుతుందని భావిస్తున్నట్లు మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెసస్ సహవ్యవస్థాపకుడు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్దేవ్ అగర్వాల్ చెపుతూ ‘ఇండియాకు వ్యతిరేకంగా బెట్ చేయవద్దని’ ఇన్వెస్టర్లకు సూచించారు. సెన్సెక్స్ ఆ ఫీట్ను సాధించాలంటే కార్పొరేట్ లాభాలు వచ్చే పదేళ్లలో చక్రగతిన వార్షికంగా 15 శాతం చొప్పున వృద్ధిచెందాల్సివుంటుందని అగర్వాల్ తెలిపారు. ఇది దేశ జీడీపీ వృద్ధి అంచనా 12-13 శాతంకంటే కాస్త అధికం. గత పదేళ్లలో బీఎస్ఈ సెన్సెక్స్ చక్రగతిన 10 శాతం చొప్పున వృద్ధిచెంది 2011 మార్చి స్థాయి 19,445 పాయింట్ల నుంచి 2021 మార్చికల్లా 49,500 పాయింట్లకు పెరిగిందని అగర్వాల్ వివరించారు. ఈ మధ్యకాలంలో పెద్ద నోట్ల రద్దు, ఐఎల్ఎఫ్ఎస్ ఉదంతం, కొవిడ్ సంక్షోభం వంటివాటిని మార్కెట్ ఎదుర్కొన్నదని ఆయన గుర్తుచేశారు. టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రైవేటు రంగ బ్యాంకింగ్, ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ రంగాలపై తాను బుల్లిష్గా వున్నట్లు అగర్వాల్ తెలిపారు. కొవిడ్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకున్న తర్వాత ఆటోమొబైల్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, పెయింట్స్ రంగాలకు డిమాండ్ ఏర్పడుతుందని అంచనావేస్తున్నట్లు చెప్పారు.
మూడేండ్లలో లక్ష పాయింట్లకు..
అగర్వాల్ తాజా అంచనాలు కాకుండా, గతంలో కూడా ఇతర మార్కెట్ నిపుణులు సెన్సెక్స్ ఆరు అంకెల స్థాయికి పెరుగుతుందన్న అంచనాల్ని వెలిబుచ్చారు. ఎలియట్ వేవ్ థియరీలో అంతర్జాతీయ నిపుణుడైన మార్క్ గాలాస్విస్కీ 2024కల్లా సెన్సెక్స్ 1,00,000 పాయింట్లను చేరుతుందంటూ 2017లో అంచనా వేశారు. సెన్సెక్స్ లక్ష పాయింట్లస్థాయిని సాధిస్తుందంటూ బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా కూడా కొద్ది సంవత్సరాల క్రితం చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాల్ని వేగంగా డిజిన్వెస్ట్ చేయాల్సిన అవసరం వుందని మోతీలాల్ ఓస్వాల్ జేఎండీ చెప్పారు. ఉపాధి కల్పన, ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టినిలపాలని సూచించారు.