ముంబై, సెప్టెంబర్ 15: కొద్దిరోజుల విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. టెలికం, ఆటో రంగాలకు కేంద్రం ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 476 పాయింట్లు ర్యాలీ జరిపి 58,723 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 139 పాయింట్లు జంప్చేసి 17,519 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ రెండు సూచీలకు ఇవి చరిత్రాత్మక గరిష్ఠాలు. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఎన్టీపీసీ 7 శాతం ర్యాలీచేయగా, ఐటీ షేర్లు టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ నూతన గరిష్ఠస్థాయిల వద్ద క్లోజయ్యాయి. టెలికం, ఆటో పరిశ్రమలకు ప్రకటించిన చర్యలు వృద్ధికి దోహదపడతాయని, టెలికం కంపెనీల రుణ భారం బ్యాంకులకు తగ్గనున్నందున, ఈ రంగానికి కూడా కేంద్ర ప్రతిపాదనలు ప్రయోజనకరమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ చెప్పారు.
టెలికం ప్యాకేజీ ప్రకటన కారణంగా భారతి ఎయిర్టెల్ 4.5 శాతం పెరిగి రూ.725 కొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా 3 శాతం వరకూ పెరిగి రూ.8 వద్ద ముగిసింది. టాటా టెలి సర్వీసెస్ 5 శాతం, టాటా కమ్యూనికేషన్ 2 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. టెలికం రంగానికి అధికంగా రుణాలిచ్చిన బ్యాంకుల్లో ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్లు 3 శాతం వరకూ పెరిగాయి.
ఆటోమొబైల్ రంగానికి కేంద్రం ప్రకటించిన రూ.26,000 కోట్ల పీఎల్ఐ స్కీముతో ఆటో షేర్లకు డిమాండ్ ఏర్పడింది. అశోక్ లేలాండ్ 2.8 శాతం, టాటా మోటార్స్ 2 శాతం, హీరో హోండా 1 శాతం చొప్పున పెరిగాయి. ఆటో విడిభాగాల కంపెనీ వరాక్ ఇంజనీరింగ్ 20 శాతం ర్యాలీ జరిపింది. జమ్నా ఆటో, ప్రికాల్, జీఎన్ఏ యాక్సిల్స్, మదర్సన్ సుమి షేర్లు 3-7 శాతం మధ్య పెరిగాయి.
వరుసగా రెండురోజుల్లో జరిగిన మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.35 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,59,68,082 కోట్లకు పెరిగింది. ఇది కొత్త రికార్డు.