ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలైన మహిళా ఓట్లు
2015తో పోల్చితే మూడింతలు పెరిగిన ఓటింగ్
మండే ఎండకూ వెరువక ఓటుహక్కు వినియోగం
హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 15 (నమస్తే తెలంగాణ)/వరంగల్: రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో ఎన్నడూ లేనంత భారీగా పోలింగ్ నమోదవటంలో మహిళా ఓటర్లు కీలకపాత్ర పోషించారు. చంటిబిడ్డల తల్లు, గర్భవతులు కూడా ఎండలో నిరీక్షించి మరీ ఓటుహక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి స్థానంలో రిజిస్టర్ అయిన మొత్తం మహిళా ఓటర్లలో 63.08 శాతం మంది ఓటువేశారు. ఈ నియోజకవర్గంలో 5,31,268 మంది ఓటర్లు ఉండగా, 3,57,354 మంది (67.26 శాతం) పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లలో మహిళలు 1,94,944 మంది ఉన్నారు. వీరిలో 1,22,990 మంది ఓటు వేశారు. గతంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా మహిళలు ఈస్థాయిలో ఓటు వేయలేదని అధికారులు అంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఏకంగా 70 శాతంమంది మహిళలు ఓటువేశారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండలోనూ అదే జోరు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానంలోనూ మహిళా ఓటర్లు భారీ సంఖ్యలో ఓటువేశారు. ఇక్కడ 2015లో పోలైన మొత్తం ఓట్లన్ని ఈసారి మహిళా ఓట్లే ఉండటం గమనార్హం. ఈ స్థానంలో మొత్తం 5,05,565 మంది ఓటర్లు రిజిస్టర్ చేసుకొన్నారు. వీరిలో పురుషులు 3,32,634 మంది, మహిళలు 1,72,864 మంది, థర్డ్ జెండర్లు 67 మంది ఉన్నా రు. ఆదివారం పోలింగ్లో 3,86,320 మంది ఓటు హక్కు వినియోగించుకోగా , వీరిలో 2,56,980 మంది పురుషులు, 1,29,330 (74.81) మంది మహిళలు ఉండటం విశేషం. 2015 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 1,53,547 మంది ఓటు వేశారు. అందులో మహిళలు కేవలం 34,835 మంది (45.95 శాతం) మాత్రమే ఉన్నారు.
తుది పోలింగ్ పర్సంటేజీని ప్రకటించిన సీఈవో
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ తుది లెక్కలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సోమవారం ప్రకటించారు. వరంగల్- ఖమ్మం-నల్లగొండలో 76.41 శాతం, మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్లో 67.26 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఈ రెండు స్థానాల్లో 2015 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్శాతం భారీగా పెరిగిందని చెప్పారు.