ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని వైద్య సేవలు
జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక క్యాన్సర్ కేంద్రాలు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
ఖమ్మం ప్రతినిధి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): సత్తుపల్లి, మధిర పట్టణాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునిక హంగులతో సకల సౌకర్యాలతో కొత్తగా 100 బెడ్లతో దవాఖానలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న సత్తుపల్లి, మధిర ఆసుపత్రులను మాతాశిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల సహాయార్థం వచ్చే వారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. బుధవారం నుంచి జిల్లా ఆసుపత్రుల్లో 19 డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని, అన్ని ఆసుపత్రుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రా సౌండ్, టూడీ ఎకోతోపాటుగా మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామాగ్రామ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న 19 డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఖమ్మం, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రులు సైతం ఉండడంతో ఈ తరహా వసతులన్నీ ఇక్కడ కూడా సమకూరనున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న డయాగ్నస్టిక్ కేంద్రాలతోపాటు మరిన్ని డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో, రేడియోథెరఫీలను అందించేందుకు అవసరమైన మౌలిక వసుతలుతోపాటు జిల్లాలో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరాలకు ఆదుకునే విధంగా ప్రస్తుతం ఉన్న బ్లడ్బ్యాంక్లను ఆధునీకరించి, అవసరమైతే నూతన బ్లడ్ బ్యాంక్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాల్లో మెరుగైన వైద్య సౌకర్యాల కోసం, అవసరమైన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాతా, శిశు సంరక్షణకు సంబంధించిన వైద్య సేవలను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రోగులతో కలువకుండా తల్లీ బిడ్డలకు ప్రత్యేకంగా వైద్య సేలను అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రి భవనాల్లో కాకుండా మాతా, శిశు సంరక్షణ కేంద్రాలను ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక భవనాల్లో హైరిస్క్ ప్రసవాలు అవసరమైన గర్భిణుల వైద్య సేవల కోసం ప్రత్యేక మెటర్నల్ ఐసీయూలను, నవజాత శిశువుల కోసం ఎస్ఎంసీయూలను ఏర్పాటు చేయనున్నారు.