కొన్ని తరాలపాటు చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయేలా తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ప్రధాన ఆలయం పనులు పూర్తయ్యాయి. ఆళ్వార్లమూర్తులు, సాలహార విగ్రహాలను అమర్చడం వంటి ప్రక్రియలు సైతం పూర్తయ్యాయి. ఇక అష్టదిక్పాలకుల విగ్రహాలు కొలువుదీరనున్నాయి. నయనానందరకరంగా నిలుస్తున్న యాదాద్రి క్షేత్రం ప్రారంభం ఎప్పుడెప్పుడా.. అని భక్తకోటి వేయి కన్నులతో ఎదురు చూస్తున్నది. సువర్ణ కాంతులతో దర్శనమిచ్చేలా వైటీడీఏ సైతం తగు రీతిలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది.
యాదాద్రి భువనగిరి, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విశ్వక్షేత్రంగా రూపొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ క్షేత్రం త్వరలోనే బంగారు వన్నెతో భక్తులను కనువిందు చేయనున్నది. ఎటు చూసినా యాదాద్రి మెరిసిపోయేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను ఆకర్షించేలా రంగురంగుల విద్యుద్దీపాలను అమర్చేందుకు దేశ వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో విద్యుద్దీపాలంకరణలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలతో అధికారులు గత కొంతకాలం కిందట సంప్రదింపులు జరిపారు. చివరకు బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థకు విద్యుద్దీకరణ బాధ్యతలను అప్పగించారు. శనివారం టెక్నికల్ కమిటీ పర్యవేక్షణలో మరోసారి ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాన ఆలయం లోపల, ముఖ మండపంలో, బయట గోపురాలకు అష్టభుజి మండపాల ప్రాకారాలకు, లోపల తిరు వీధులకు లైటింగ్స్ వేసి గత కొద్దిరోజులుగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆళ్వార్, యూని పిల్లర్లు, ప్రహ్లాద ఘట్టాలు, అష్టభుజి ప్రాకార మండపం, ఆలయ మండపాలు విద్యుత్ కాంతుల్లో జిగేల్ మంటూ కనువిందు చేశాయి. కృష్ణశిలలతో అద్భుతంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధాన ఆలయం అత్యాధునిక లైటింగ్ ఏర్పాట్లతో మరింత కాంతివంతంగా మెరుస్తూ కనువిందు చేస్తున్నది.
ప్రధానాలయం విద్యుద్దీకరణకు రూ.12కోట్లు
ప్రధానాలయం విద్యుద్దీకరణ కోసం వైటీడీఏ రూ.12కోట్లను వెచ్చిస్తున్నది. ప్రధానాలయం చుట్టూ నిర్మించిన పారాపెట్ గోడపై కూడా ప్రత్యేకాకర్షణగా శంఖుచక్ర ఆకారాలతో అందమైన విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. వీటికి ద్వారకా కంపెనీ రూప కల్పన చేసింది. యాదాద్రి ఆలయం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని అమెరికా, రష్యన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆలయం ప్రాంగణమంతా బంగారం, పసుపు వర్ణంలో మెరిసేలా ఆర్కిటెక్ ఆనంద్సాయి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. యాదాద్రి దేవాలయానికి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యుత్ కంట్రోల్ రూం సైతం ఏర్పాటవుతోంది.
ఇక మౌలిక వసతులపైనే దృష్టి..
రూ.1200 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ప్రారంభించిన యాదాద్రి ఆలయం పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఇప్పటికే రూ.800 కోట్ల వరకు వెచ్చించగా, ప్రధానాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. దీంతో వైటీడీఏ ఆలయం చుట్టూ మౌలిక సదుపాయాల కల్పనపైనే దృష్టి పెట్టింది. ప్రధానాలయంలోని ముఖ మండపం ఎన్నో విశిష్టతలకు నిలయంగా నిలవగా.. ఆలయ నలుమూలల చేపడుతున్న నిర్మాణాలు సైతం యాదాద్రికి మరింత వన్నె తెస్తున్నాయి. ప్రధానాలయానికి పడమర దిశ కింది భాగంలో చేపట్టిన కార్యనిర్వాహక కార్యాలయం, వీఐపీల విడిది తదితర నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఆలయానికి వాయువ్య దిశలో నిర్మిస్తున్న లిఫ్ట్ గది, రథశాల నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. రథశాల ముందు భాగాన.. ప్రహరీ అంచున ఏర్పాటు చేసిన గార్డెనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో సాలహారాల్లో విగ్రహాల బిగింపు ప్రక్రియ సైతం పూర్తయ్యింది.
అద్దాల మండపానికి ఇత్తడి తొడుగుల అమరిక సైతం పూర్తయ్యింది. క్యూకాంప్లెక్స్ క్యూలైన్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రధానాలయంలో అధునాతన క్యూలైన్ల బిగింపు ప్రక్రియ.. మాఢవీధుల్లో క్యూలైన్ల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. క్యూకాంప్లెక్స్ పక్కనే పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించిన విష్ణు పుష్కరిణి అందంగా ముస్తాబైంది. గతంలో 500 గజాల్లోనే శివాలయం ఉండగా, ప్రస్తుతం ఎకరం స్థలంలో విస్తరించిన శివాలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం, ఆంజనేయస్వామి మండపం, మరకత మండపం, రామాలయం చుట్టూ ప్రాకారాలను నిర్మించారు. నిత్యకల్యాణ మండపం, బ్రహ్మోత్సవ మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.