60,412 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై, సెప్టెంబర్ 27: స్టాక్ సూచీల రికార్డుల పరంపర కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్ తొలిదశలో మరో కొత్త రికార్డుస్థాయి 60,412 పాయింట్ల వద్దకు చేరింది. రికార్డు గరిష్ఠం నుంచి ముగింపులో కొంతవరకూ తగ్గినప్పటికీ, చివరకు 29 పాయింట్ల లాభంతో 60,078 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ స్థాయిలో ముగింపు ఇదే తొలిసారి. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 17,943 పాయింట్ల గరిష్ఠానికి చేరిన తర్వాత, చివరకు 2 పాయింట్ల స్వల్పలాభంతో 17,855 పాయింట్ల కొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా మారుతి సుజుకి 6.53 శాతం ర్యాలీ జరిపింది. మహింద్రా, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్లు లాభపడిన షేర్లలో ఉన్నాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్నాలజీ, టెక్ మహింద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, నెస్లే ఇండియా, హెచ్యూఎల్లు నష్టాలతో ముగిసాయి. ఐటీ, ఫార్మా షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగిందని, అయితే ఆటోమొబైల్ షేర్లలో జరిగిన ర్యాలీ కారణంగా సూచీలు లాభాలతో ముగియగలిగాయని రిలయన్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ బినోద్ మోది చెప్పారు. అక్టోబర్ నుంచి వాహనాలకు డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో రెండు నెలల నుంచి మందకొడిగా ట్రేడవుతున్న ఆటోమొబైల్ షేర్లలో తాజాగా కొనుగోళ్లు జరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఆటో, రియల్టీ, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకెక్స్ సూచీలు 3.1 శాతం వరకూ పెరిగాయి. ఐటీ, టెక్నాలజీ, హెల్త్కేర్, ఎఫ్ఎంసీజీ సూచీలు నష్టపోయాయి.