న్యూఢిల్లీ, జూలై 13: మెరుగైన ఆర్థిక గణాంకాలు వెల్లడైన నేపథ్యంలో ఫైనాన్షియల్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగడంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 397 పాయింట్లు పెరిగింది. ఇంతగా లాభపడటం గత ఆరువారాల్లో (మే 31 తర్వాత) ఇదే ప్రథమం. వరుసగా మూడు ట్రేడింగ్ రోజుల్లో నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ తాజాగా 397 పాయింట్ల లాభంతో 52,770 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 120 పాయింట్లు ర్యాలీ జరిపి 15,812 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఐసీఐసీఐ బ్యాంక్ 2.8 శాతం పెరిగింది. లాభపడిన షేర్లలో హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, సన్ఫార్మా, ఎన్టీపీసీలున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడం, పారిశ్రామికోత్పత్తి 29 శాతం వృద్ధి చెందడం తదితర గణాంకాలు మార్కెట్ ర్యాలీకి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.