8 నెలల్లో సూచీ పరుగు
48,000 నుంచి 58,000లకు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ర్యాలీజరపడంతో స్టాక్ మార్కెట్ రికార్డు పరుగు శుక్రవారంసైతం కొనసాగింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 58,000పైన ముగిసింది. ఈ సూచి మరో 277 పాయింట్లు పెరిగి 58,129 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచి కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలో 57,000 పాయింట్లస్థాయి నుంచి 58,000 పాయింట్ల శిఖరాన్ని అందుకుంది. ఐదు ట్రేడింగ్ సెషన్లలో 2,000 పాయింట్లు ర్యాలీ జరిపిన సెన్సెక్స్, ఈ ఏడాది 8 నెలల్లో 10,000 పాయింట్లకుపైగా పెరగడం గమనార్హం. 47,751 పాయింట్ల వద్ద 2021వ సంవత్సరాన్ని ప్రారంభించిన సెన్సెక్స్ తాజాగా 10,000 పాయింట్ల పరుగును పూర్తిచేసుకుంది. పలువురు విశ్లేషకులు ఈ ఏడాది సూచి వృద్ధి 10 శాతంలోపే ఉంటుందని అంచనావేయగా, ఇప్పటివరకూ 21.4 శాతం ర్యాలీ జరిపింది. 2021 జనవరి 21న తొలిసారిగా 50,000 పాయింట్ల మార్క్ను అందుకున్న సెన్సెక్స్ సెప్టెంబర్ 3కల్లా 58,000పైన పాగా వేసింది. ఇక తాజాగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి 89 పాయింట్లు పెరిగి, 17,300 పాయింట్ల ఎగువన 17,323 పాయింట్ల కొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది. ఈ సూచి గత ఐదురోజుల్లో 618 పాయింట్లు పెరిగింది.
4 లక్షల కోట్లుపెరిగిన సంపద
సెన్సెక్స్ తొలిసారిగా 58,000 పాయింట్లపైన ముగిసిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద కేవలం రెండు రోజుల్లో రూ.4 లక్షల కోట్లు పెరిగింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 750 పాయింట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారం రూ.2,54,21,578 కోట్ల రికార్డుస్థాయికి చేరింది. బీఎస్ఈ-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతంపైగా ర్యాలీచేయగా, టైటాన్, టాటా స్టీల్, ఆసియన్ పెయింట్స్, మారుతి షేర్లు కూడా లాభపడ్డాయి. ఈ వారం మొత్తంమీద మార్కెట్లో ర్యాలీ విస్త్రతంగా జరిగిందని, కొన్ని షేర్లకే పరిమితంకాలేదని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. అన్ని కీలక రంగాల సూచీలు ఈ వారం ర్యాలీలో పాలుపంచుకున్నట్లు ఆయన తెలిపారు.
15 లక్షల కోట్లపైకి రిలయన్స్ విలువ..
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) సరికొత్త ఫీట్ను సాధించింది. శుక్రవారం సూచీల ర్యాలీకి నేతృత్వం వహించిన ఆర్ఐఎల్ 4.1 శాతం పెరిగి రూ.2,388 రికార్డు ధర వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రప్రధమంగా రూ.15 లక్షల కోట్ల మార్క్ను అధిగమించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రికార్డులకెక్కింది. మార్కెట్ ముగింపు సమయానికి ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.15,14,017 లక్షల కోట్లు. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకగా గ్రీన్ హైడ్రోజన్ని రిలయన్స్ అందించబోతున్నదని, ఈ ఇంధన తయారీ వ్యయాన్ని దశాబ్దకాలంలోగా కేజీకి 1 డాలరులోపునకు తగ్గిస్తామంటూ ముకేశ్ అంబానీ ప్రకటన చేయడంతో ఈ షేరులో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగాయి. కాగా ఈ ఏడాది జూన్ నెలలో ఆర్ఐఎల్ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.14 లక్షల కోట్ల మార్క్ను అందుకుంది. ఈ షేరు ఈ ఏడాది ఇప్పటివరకూ 20 శాతంపైగా ర్యాలీ జరిపింది. ఇక అత్యంత విలువైన షేర్లలో రెండోస్థానంలో ఉన్న టీసీఎస్ ఇటీవలే రూ.14 కోట్ల మార్క్ను దాటిన సంగతి తెలిసిందే.
సూచీల రికార్డు ర్యాలీకి కారణాలివే…
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో 20 శాతం పెరిగిన భారత్ జీడీపీ వచ్చే త్రైమాసికంలో మరింత
పుంజుకుంటుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరపడం.
కొద్దివారాలుగా రిటైల్ ఇన్వెస్టర్లు, దేశీ ఫండ్స్ ఈక్విటీల్లో భారీ మొత్తాలను పెట్టుబడి చేస్తుండగా,
కొద్దివారాలపాటు అమ్మకాలు జరిపిన విదేశీ
ఇన్వెస్టర్లు… ఈ వారంలో బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు చేయడంతో సూచీల పరుగు
మరింత జోరందుకుంది.
వ్యాక్సినేషన్లు వేగవంతంకావడంతో పలు వ్యాపార సముదాయాలు పునర్ప్రారంభంకావడంతో ఈ పండుగల సీజన్లో వసూత్పత్తులకు భారీ
డిమాండ్ ఏర్పడుతుందన్న విశ్లేషణలు.
ఇండియా సర్వీసుల పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టు నెలలో 56.7కు పెరిగిందంటూ విడుదలైన గణాంకాలు..మార్కెట్కు కొత్త
ఉత్సాహాన్ని ఇచ్చాయి. . పీఎంఐ ఒక నెలలో
ఇంత గరిష్ఠస్థాయికి పెరగడం ఏడాదిన్నర తర్వాత ఇదే ప్రధమం. 2021 జూలై నెలలో
ఈ సూచి విలువ 45.4.