మెడికల్ కాలేజీ మంజూరుపై మానుకోటలో అంబరాన్నంటిన సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
స్వీట్లు పంచుకుని మురిసిన నేతలు
కళాశాల కోసం అధికారుల స్థల పరిశీలన
సీఎం కేసీఆర్కు ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు
1959లో వరంగల్కు కాకతీయ మెడికల్ కళాశాల వచ్చింది. ఉమ్మడి జిల్లాకు మళ్లీ ఆరు దశాబ్దాల తర్వాత సీఎం కేసీఆర్ పుణ్యమా అని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరో మెడికల్ కళాశాల, అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు బాటలు పడ్డాయి. గిరిజనులు అత్యధికంగా ఉన్న మానుకోట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. 2019లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్కు మెడికల్ కళాశాలను మంజూరు చేయడంపై జిల్లావ్యాప్తంగా మంగళవారం సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా, ప్రజాప్రతినిధుల నుంచి సీఎంకు కృతజ్ఞతలు వెల్లువెత్తాయి.
మహబూబాబాద్, మే18 (నమస్తేతెలంగాణ): మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై మానుకోటలో సంబురాలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో వైద్యరం గాన్ని మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్ లో రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ మానుకోటకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి.
నిర్మాణానికి స్థల పరిశీలన
రాష్ట్ర ప్రభత్వం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజునే జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సుమారు 40 ఎకరాల భూమి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మల్యాల, గుమ్మడూరుచ గాంధీనగర్ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. జిల్లా కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న మూడు ప్రాంతాల్లో భూమిని, ప్రస్తుత ఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చూశారు. ఒకట్రెండు రోజుల్లో వైద్య కళాశాల నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో వైద్యరంగం బలోపేతమే లక్ష్యం
ఉమ్మడి జిల్లాలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ వైద్యశాలల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సులు చేయాలనుకునేవారికి మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా వరంగల్ నగరంలో 1959లో కాకతీయ మెడికల్ కళాశాల ఏర్పాటైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు దశాబ్దాల తర్వాత మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరో మెడికల్ కళాశాల, అనుబంధంగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో మానుకోట ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్లయింది. గిరిజనులు అత్యధికంగా ఉన్న మహబూబాబాద్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్రావు
గిరిజనులకు మెరుగైన వైద్యం
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మానుకోటను జిల్లాగా మార్చారు. ఇప్పుడు జిల్లాకు మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, మెడికల్ రీజినల్ సబ్సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతివ్వడం సంతోషంగా ఉంది. వీటి ద్వారా గిరిజనులకు మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. గిరిజనులు, పేదలపై సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ ఉంది. గిరిజనులు ఎక్కువగా ఉన్న మానుకోటకు వైద్యకళాశాల ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది.
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్