Digital Gold | డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్ను నియంత్రించడానికి స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నూతన నిబంధనలను అమలులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నది. న్యూఏజ్ ఇన్వెస్టర్లతో డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్ పాపులరవుతోంది.. దాంతోపాటు డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్లో రెగ్యులేటరీ వాక్యూమ్కు తెర దించేందుకు సెబీ పూనుకున్నది.
దీని ప్రకారం ప్రతిపాదిత స్పాట్ ఎక్స్చేంజ్పైనే రిజిస్టర్డ్ బ్రోకర్లు, మార్కెట్ మధ్యవర్తులు డిజిటల్ గోల్డ్ (Digital Gold) విక్రయాలు చేపట్టడానికి సెబీ అనుమతి ఇస్తుంది. ఇందుకోసం నూతన ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని యోచిస్తున్నది.
డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్ కోసం ప్రతిపాదిత ఎక్స్చేంజ్ ఏర్పాటు, తుది నియంత్రణలపై సెబీ గత మే నెలలో కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసింది. ఫిజికల్ గోల్డ్ను ఎలక్ట్రానిక్ గోల్డ్గా.. తిరిగి ఫిజికల్ గోల్డ్గా కన్వర్ట్ చేయడానికి విస్తృతమైన ఫ్రేమ్వర్క్ రూపకల్పనకు ప్లాన్ చేస్తోంది.
సెబీ ప్రతిపాదిత గోల్డ్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయడం వల్ల దేశీయ స్పాట్ మార్కెట్లో పారదర్శక ధర విధానం ఆవిష్కరణ, నాణ్యతకు హామీ, దేశీయ బంగారం డెలివరీ ప్రమాణాల ప్రమోషన్, ఫైనాన్సియల్ మార్కెట్లతో అనుసంధానం, బంగారం రీసెక్లింగ్ పెంపునకు మార్గం సుగమం అవుతుంది.
భారత్లో అప్స్టోక్స్, గ్రో, పేటీఎం మనీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ వంటి సంస్థలు భారత్లో డిజిటల్ గోల్డ్ (Digital Gold) లో ఇన్వెస్టర్లకు ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు డిజిటల్ గోల్డ్ విక్రయాలను నిలిపేయాలని రిజిస్టర్డ్ సంస్థలను సెబీ ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.