న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా పని చేస్తున్న సంస్థ ఫ్రాంక్లిన్ టెంప్లెటన్ ట్రస్టీ సర్వీసెస్పై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) కొరడా ఝుళిపించింది. సంస్థ నిర్వహించిన ఆరు డెట్ స్కీమ్లతో సంబంధం ఉన్న ఫండ్ మేనేజర్లు, సీనియర్ అధికారి సహా తొమ్మిది మందిపై మొత్తం రూ.15 కోట్ల పెనాల్టీ విధించింది.
ఫ్రాంక్లిన్ టెంప్లెటన్ ట్రస్టీ సర్వీసెస్ మీద రూ.3 కోట్లు, ఫ్రాంక్లిన్ అసెట్ మేనేజ్మెంట్ (ఇండియా) ప్రెసిడెంట్ సంజయ్ సప్రే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతోష్ కామత్లపై రూ.2 కోట్ల చొప్పున జరిమాన విధించింది.
ఫ్రాంక్లిన్ టెంప్లెటన్ ఫండ్ మేనేజర్లు కునాల్ అగర్వాల్, సుమిత్ గుప్తా, పల్లబ్ రాయ్, సచిన్ పద్వాల్ దేశాయ్, ఉమేశ్ శర్మలపై ఒక్కొక్కరికి రూ.1.5 కోట్ల చొప్పున ఫైన్ వేసింది. సంస్థ చీఫ్ కంప్లియెన్స్ ఆఫీసర్ సౌరభ్ గంగ్రాడేపై రూ.50 లక్షల జరిమాన విధించింది.
ఈ ఆదేశాలు అందుకున్న 45 రోజుల్లో పెనాల్టీ చెల్లించాల్సిందేనని సెబీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. రెండున్నర దశాబ్దాలుగా భారత మార్కెట్లో ఉన్న టెంప్లెటన్ సమస్యల్లో చిక్కుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని తెలిపింది. ఇంతకుముందు టెంప్లెటన్ మ్యూచువల్ ఫండ్స్పై రూ.5 కోట్ల ఫైన్ వేసింది సెబీ.