నాడు..
కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అగ్రరాజ్యం అమెరికాకు భారత్ బాసటగా నిలిచింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాక మునుపు, కరోనా చికిత్సలో కీలకమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్ వంటి మందులను అమెరికాకు విరివిరిగా ఎగుమతి చేసింది.
నేడు
కరోనా విలయతాండవంతో అల్లాడుతున్న భారత్కు సాయమం దించడంలో అమెరికా వెనకడుగు వేస్తున్నది. తమకు తమ ప్రజలే ముఖ్యమని, వ్యాక్సిన్ ముడిపదార్థాల ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయలేమని స్వయానా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తేల్చిచెప్పారు.
‘తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం’ అనేది సామెత. మనిషి సంగతి సరే, దేశమైతే పాలకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. తమ ప్రజల బాగోగుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కానీ కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో మన దేశం అనుసరించిన విధానమే విమర్శకు గురవుతున్నది. ప్రపంచంలోనే వ్యాక్సిన్ తయారీలో మనది అగ్రశ్రేణి దేశం. కరోనా పేట్రేగిపోతున్న నేపథ్యంలో మన ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లను సరఫరా చేసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కానీ ముందు వెనుకలు ఆలోచించకుండా ఇతర దేశాలకు పలారం పంచినట్టు కేంద్రం ఎగుమతులు చేసింది. ఇజ్రాయెల్ వంటి దేశం తొలుత తమ ప్రజలందరికీ టీకాలిచ్చి మాస్క్లు అవసరం లేని దశకు చేరుకున్నది. పలు యూరప్ దేశాలు భారీ ఎత్తున తమ ప్రజలకు టీకాలు ఇచ్చాయి. భారత్ మాత్రం టీకాలు ఇవ్వడంలో కనీసం డెబ్బయి దేశాల కింద ఉన్నది.
మన దేశంలో వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలకు ఇప్పుడు తీవ్ర కొరత ఏర్పడింది. అమెరికా ముడిపదార్థాల ఎగుమతిపై నిషేధం విధించింది. మాకు మా ప్రజల పట్ల బాధ్యత ఉన్నది అందువల్ల ఎగుమతులు చేయలేమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. ఒక టీకా తయారీకి 9వేల రకాలైన ముడిపదార్థాలు వినియోగిస్తారు. వాటిని 30 దేశాలు మాత్రమే ఎగుమతి చేస్తున్నాయి. ఇందులో 55 శాతం అమెరికా మాత్రమే ఎగుమతి చేస్తున్నది. భారత్ ఎక్కువగా ఆధారపడే జర్మనీ కూడా తమ ప్రజల అవసరాలే ప్రధానం అంటున్నది. కొవిడ్ మొదట దశ తీవ్రంగా ఉన్నప్పుడు, యురోపియన్ యూనియన్ దేశాలే పరస్పరం ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతులపై నిషేధం విధించుకున్నాయి.
కేంద్రం వైఫల్యమే..
మన దేశంలో టీకాలు తయారైనా మన ప్రజలకు భద్రత లేకుండా పోయింది. దీంతో కొవిడ్ విస్తరించి, ఔషధాలకు, ఆక్సిజన్కు కొరత ఏర్పడ్డది. ముందుచూపు కొరవడి వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో కేంద్రం విఫలమైంది. ఫలితమే ఈ మహా విషాదం.
అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి
కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు అండగా నిలిచిన భారత్కు సాయమందించాలని అమెరికా ప్రభుత్వంపై అక్కడి చట్టసభ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లతోపాటు ప్రాణాధార ఔషధాలను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భారత్కు ఏ విధంగా సాయం అందించగలమో పరిశీలిస్తున్నామని ఆ దేశ అధికారులు శనివారం పేర్కొన్నారు. కరోనాతో అల్లాడుతున్న భారత ప్రజలకు తమ సానుభూతి తెలియజేస్తున్నామని వైట్హౌస్ సెక్రటరీ జెన్సాకీ అన్నారు.