న్యూఢిల్లీ, జూన్ 26: కొవిడ్ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ బ్యాంకింగ్ రంగం రికార్డుస్థాయిలో రూ.1,02,252 కోట్ల లాభాల్ని ఆర్జించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల నష్టాల్ని చవిచూసిన బ్యాంకింగ్ పరిశ్రమకు 2020-21 పెద్ద టర్న్ఎరౌండ్ ఏడాదిగా నిలిచింది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆర్జించిన మొత్తం లాభాల్లో సగం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలదే కావడం విశేషం. ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ నికరలాభం 18 శాతం వృద్ధితో రూ.31,116 కోట్లకు చేరగా, ప్రభుత్వ రంగ ఎస్బీఐ రూ.20,410 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అధికలాభాలు సంపాదించిన బ్యాంకుల్లో మూడోస్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంకు నికరలాభం అంతక్రితం ఏడాదితో పోలిస్తే రెట్టింపై రూ.16,192 కోట్లకు పెరిగింది.
రెండు ప్రభుత్వ బ్యాంకులకే నష్టం
ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిపి 2020-21 మొత్తంగా నికరలాభాన్ని ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం ఇలా లాభాల్ని వెల్లడించడం ఐదేళ్ల తర్వాత ఇదే ప్రధమం. 2019-20లో రూ.26,015 కోట్ల నష్టాల్ని తెచ్చుకున్న ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కలిపి ముగిసిన ఏడాది రూ.31,817 కోట్ల లాభాల్ని సంపాదించాయి. భారీగా డిఫాల్ట్ అయిన రూ.4 లక్షల కోట్ల పెద్ద ఖాతాలన్నింటినీ ఎన్పీఏలుగా వర్గీకరించి, దివాళా ప్రక్రియను చేపట్టాలంటూ బ్యాంకుల్ని రిజర్వుబ్యాంక్ ఆదేశించిన నేపథ్యంలో ఈ టర్న్ ఎరౌండ్ సాధ్యపడింది. ఈ మొండిబకాయిలకు కేటాయింపుల్ని 2020 మార్చితో ముగిసిన ఏడాదిలోనే దాదాపుపూర్తి చేయడంతో 2020-21లో ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలెన్స్షీట్స్ మెరుగుపడ్డాయి. మొత్తం 12 పీఎస్యూ బ్యాంకుల్లో రెండు మాత్రమే నష్టాల్ని చవిచూశాయి. అవి పంజాబ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు. ప్రైవేటు రంగంలో యస్ బ్యాంక్ కూడా నష్టాల బాటలోనే నడిచింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా ఈ బ్యాంక్ 2020-21లో రూ.3,462 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది.