నిబంధనల ఉల్లంఘనపై లోక్సభలో కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 19: నిబంధనల ఉల్లంఘన ఆరోపణలున్న పలు అదానీ గ్రూప్ సంస్థలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విచారణ జరుపుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ సంస్థల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన మారిషస్కు చెందిన ఆరు ఫండ్స్ల్లో మూడింటి ఖాతాలను 2016లో ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అడిగిన ప్రశ్నకుగాను సోమవారం లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి పైవిధంగా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అయితే సెబీ, డీఆర్ఐల విచారణను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ కంపెనీలు ఏమిటీ? అన్న వివరాలను మాత్రం చౌధరి వెల్లడించలేదు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులేవీ ఈ కేసులో లేవన్నారు.
ఈసారే ఎల్ఐసీ ఐపీవో
ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావు కరద్ చెప్పారు. ఇప్పటికే ఎల్ఐసీ ఐపీవో కోసం కేంద్రం మర్చెంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్ల నుంచి బిడ్స్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. 2021-22లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.