హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉత్పత్తిలో సింగరేణి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కంపెనీ సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. భారీ వర్షాలతో ఈ నెల ప్రథమార్ధంలో రోజుకు 1.85 లక్షల టన్నులకుగాను 1.43 లక్షల టన్నుల ఉత్పత్తే సాధ్యమైందన్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో ప్రతిరోజూ 1.85-1.9 లక్షల టన్నులు, డిసెంబర్లో రోజూ 2 లక్షల టన్నులు, జనవరి-మార్చిలో 2.20 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి సాధించేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, విదేశీ బొగ్గు ధర విపరీతంగా పెరగడంతో దేశీయ బొగ్గుకు డిమాండ్ నెలకొన్నదని, కాబట్టి అధిక ఉత్పత్తికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.