న్యూఢిల్లీ, జూలై 31: గృహ రుణాలు తీసుకునేవారికి బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుభవార్తను అందించింది. గృహరుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ‘మాన్సూన్ ధమాకా ఆఫర్’గా ఈ సదుపాయాన్ని పరిమితకాలమే అందిస్తున్నామని, ఆగస్టు 31వరకూ అమలులో ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుతం గృహరుణాలపై ప్రాసెసింగ్ ఫీజు.. రుణ మొత్తంలో 0.40 శాతంగా ఉంది. ప్రస్తుతం తమ గృహ రుణాలు 6.70 శాతం వడ్డీకే లభిస్తున్న నేపథ్యంలో ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేసినందున, ఇండ్ల కొనుగోలుకు ఇంతకంటే మంచి సమయం ఉండదని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్(రిటైల్) సీఎస్ శెట్టి చెప్పారు. బ్యాంకు యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి గృహ రుణాలకు 5 బేసిస్ పాయింట్ల (0.05 శాతం) రాయితీని కూడా ఇస్తున్నది. అలాగే వడ్డీ రేటుపై 5 బేసిస్ పాయింట్ల (0.05 శాతం) రాయితీకి మహిళా ఖాతాదారులకు రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించింది.