న్యూఢిల్లీ, మే 8: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో దేశం విలవిల్లాడుతున్నది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కి ఇప్పటికే ఎంతో మంది ప్రజలు శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలతో అల్లాడుతుంటే మరోవైపు వీరి దైన్య స్థితిని ఆసరాగా చేసుకొని ఆర్థిక మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొంటామంటూ కొందరు.. వైద్య చికిత్సల పేరుతో ఆశచూపుతూ మరికొందరు యథేచ్ఛగా ఆర్థిక మోసాలకు తెగబడుతున్నారు. ఇలాంటి మాయగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా అక్రమార్కుల నుంచి వచ్చే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయవద్దని ఎస్బీఐ హెచ్చరించింది.
మాయమాటలతో బ్యాంక్ కస్టమర్లను తప్పుదారి పట్టించేందుకు అక్రమార్కులు అనేక మార్గాలను అనుసరిస్తున్నారని, అలాంటి వారి నుంచి వచ్చే మోసపూరితమైన ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లకు దూరంగా ఉండాలని పీఎన్బీ సూచించింది. కస్టమర్లు తమ బ్యాంకింగ్ వివరాలను లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులెవరికీ తెలియజేయకూడదని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొన్నది. కస్టమర్ల బ్యాంక్ ఖాతా వివరాల కోసం బ్యాంకు ఉద్యోగులు ఎప్పుడూ ఫోన్కాల్స్ గానీ, ఎస్ఎంఎస్లు గానీ చేయరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఇలాంటి ఫోన్కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు వస్తే వాటిని మోసపూరితమైనవిగా పరిగణించి అప్రమత్తంగా వ్యవహరించాలని కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది.