న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులు వాడుతున్న జన్ధన్ ఖాతాదారుల కోసం ఎస్బీఐ ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తున్నది. ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.2 లక్షల బీమా కవరేజీ అందుతుంది.
అన్ని డెబిట్ కార్డులు కొన్ని కాంప్లిమెంటరీ సర్వీసులు కలిగి ఉన్నాయి. ప్రమాద బీమాతోపాటు డెబిట్ కార్డులపై పర్చేజ్ ప్రొటక్షన్ కవర్, తదితర బెనిఫిట్లు ఉన్నాయి.
ఆర్థికంగా అణగారిన వర్గాలకు ఆర్థిక, బ్యాంకింగ్ సేవలు చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు 2014లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు.
పేదలు డబ్బు డిపాజిట్ చేయడానికి, చెల్లింపులు జరపడానికి, రుణ పరపతి, బీమా, పెన్షన్ వసతులను కల్పించాలన్నదే ఈ పథకం లక్ష్యం.
నో యువర్ కస్టమర్ (కేవైసీ) పత్రాలతో ఆన్లైన్లోనూ జన్ధన్ ఖాతా తెరవొచ్చు. బేసిక్ సేవింగ్స్ ఖాతా నుంచి జన్ధన్ ఖాతాలోకి నగదు బదిలీ ఆప్షన్ ఉంది.
జన్ధన్ ఖాతా కలిగి ఉన్న వారు బ్యాంకు నుంచి రూపే పీఎంజేడీవై కార్డు పొందొచ్చు. 2018 ఆగస్టు 28 వరకు జన్ధన్ ఖాతాదారులకు రూపే పీఎంజేడీవై కార్డులు జారీ అయ్యాయి. వీటిపై రూ. లక్ష బీమా కల్పించారు. 2018 ఆగస్టు 28 తర్వాత జారీ అయిన రూపే కార్డులపై రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ ఇచ్చారు.
జన్ధన్ ఖాతాదారులు కనీసం ఒక్కసారి ఫైనాన్సియల్, ఆర్థికేతర లావాదేవీ జరుపాలి. ప్రమాదం జరుగడానికి 90 రోజుల ముందు రూపే డెబిట్ కార్డుతో ఈ లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది.
భారత్ బయట ప్రమాదం జరిగినా ప్రమాద బీమా వర్తిస్తుంది. అందుకు అవసరమైన పత్రాలు సమర్పిస్తే, క్లెయిమ్లకు అనుగుణంగా రూపాయిల్లో చెల్లిస్తారు.
ప్రమాద బీమా పాలసీ దారు మరణిస్తే, సదరు వ్యక్తి నామినీ లేదా, వారసులకు లబ్ధి చేకూరింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే వారసత్వ పత్రాలకు అనుగుణంగా క్లెయిమ్లు సెటిల్ చేస్తారు.
ప్రమాద బీమా పాలసీదారులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అందుకు సమర్పించాల్సిన పత్రాలేమిటో తెలుసుకుందాం..
డ్యూలీ కంప్లీటెడ్ అండ్ సంతకం చేసిన క్లెయిమ్.. మరణ ధ్రువీకరణ పత్రం, ప్రమాదంపై పోలీసుల నివేదిక, పోస్ట్మార్టం రిపోర్ట్, పాలసీ దారు, ఆ వ్యక్తి నామినీ ఆధార్ పత్రాల జిరాక్స్ కాపీలు సమర్పించాలి.
కార్డు జారీ చేసినట్లు బ్యాంకు ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ స్టాంప్ ఉన్న సంబంధిత అధికారి ధ్రువీక్రుత అధికారి సంతకం ఉన్న పత్రాన్ని సమర్పించాలి.
రూపే కార్డు, ప్రమాదానికి ముందు 90 రోజుల్లో లావాదేవీ జరిపిన స్టేట్మెంట్ జిరాక్స్ అందజేయాలి.
పాలసీ దారు నామినీ, పాస్పోర్ట్తోపాటు ఆమె బ్యాంక్ ఖాతా వివరాలు అందజేయాలి.
ప్రమాదంపై పోలీసుల ఎఫ్ఐఆర్ గురించి సంక్షిప్త సమాచారం, బ్యాంకు అధికారి పేరు, కాంటాక్ట్ డిటైల్స్ అండ్ ఈ-మెయిల్ ఐడీ తదితర వివరాలు సమర్పించాలి.
పత్రాలు అందిన తర్వాత పది దినాల్లో క్లెయిమ్లు పరిష్కారం అవుతాయి. 2022 వరకు ఈ బెనిఫిట్లు వర్తిస్తాయి. ఎన్పీసీఐతో రూపే పీఎంజేడీవై కార్డుకు భాగస్వామ్య బీమా సంస్థగా దీ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ తోడ్పాటునందిస్తున్నది.