న్యూఢిల్లీ, ఆగస్టు 6: కరోనా సంక్షోభం నేపథ్యంలో బంగారంపై రుణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే గోల్డ్ లోన్ వడ్డీరేట్లపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రాయితీలను ఇస్తున్నది. ఆభరణాలపైనేగాక, బ్యాంకులు అమ్మిన పసిడి నాణేల తాకట్టుపైనా తక్కువ వడ్డీరేట్లకే రుణాలిస్తున్నది. ముఖ్యంగా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే కనిష్ఠంగా 7.5 శాతం వడ్డీకే రుణం పొందవచ్చు. 18 ఏండ్లపైబడినవారెవరైనా ఈ రుణాలకు అర్హులే. రెండు ఫొటోలు, చిరునామా ఐడీ ఉంటే చాలు. కనిష్ఠంగా రూ.20వేలు, గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. రుణ కాలపరిమితి మూడేండ్లు.