ముంబై, మే 1: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ప్రారంభ వడ్డీరేటును 6.95 శాతం నుంచి 6.7 శాతానికి దించినట్లు శనివారం ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. మహిళా రుణ గ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల ప్రత్యేక రాయితీ కూడా ఇస్తున్నట్లు తెలిపింది. ‘మేము తీసుకున్న ఈ నిర్ణయంతో ఈఎంఐ భారం గణనీయంగా తగ్గుతుంది. సరసమైన ధరల్లో లభించే గృహాల రుణాలకు కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తుందని ఆశిస్తున్నాం’ అని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి అన్నారు. నిజానికి ఈ ఏడాది మార్చి 31దాకా గృహ రుణాలపై వడ్డీరేట్లను ప్రత్యేక ఆఫర్లో భాగంగా 6.7 శాతం వద్దే ఎస్బీఐ ఉంచింది. ఏప్రిల్ 1 నుంచి 6.95 శాతానికి సవరించింది. సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్లీ 6.7 శాతానికే తెచ్చింది.
ఏ రుణంపై ఎంతెంత వడ్డీ?
రూ.30 లక్షల వరకు రుణాలపై 6.7 శాతం వడ్డీనేనని ఎస్బీఐ తెలిపింది. రుణాలు తీసుకునేవారు మహిళలైతే 6.65 శాతం వడ్డీరేటే వర్తిస్తుంది. అలాగే రూ.30 లక్షల నుంచి 75 లక్షల వరకుండే రుణాలపై వడ్డీరేటు 6.95 శాతంగా ఉంటుందని ఈ సందర్భంగా బ్యాంక్ స్పష్టం చేసింది. రూ.75 లక్షలకుపైగా తీసుకునే రుణాలపై 7.05 శాతం వడ్డీని వసూలు చేస్తామని ఎస్బీఐ వెల్లడించింది.
యోనో యాప్పై రాయితీ
ఎస్బీఐ ఖాతాదారులు యోనో యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే వడ్డీరేటుపై అదనంగా 5 బేసిస్ పాయింట్ల రాయితీ వస్తుందని బ్యాంక్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దేశీయ గృహ రుణాల మార్కెట్లో ఎస్బీఐ వాటానే 34 శాతానికిపైగా ఉన్నది. బ్యాంక్ హోమ్ లోన్ పోర్ట్ఫోలియో రూ.5 లక్షల కోట్ల మార్కును కూడా దాటింది. మరోవైపు ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో మరిన్ని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలూ తమ గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించే వీలుందని పరిశ్రమ భావిస్తున్నది.