న్యూఢిల్లీ: జీరో బ్యాలెన్స్ ఖాతాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత ఐదేండ్లలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఐఐటీ బాంబే జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎస్బీఐతోపాటు పలు బ్యాంకులు ఖాతాలో డబ్బులు లేకపోయినా నిర్ణయించిన మేరకు కనీస నగదు లేకపోయినా ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాలు కలిగిన ఎస్బీఐ 2015-20 వరకు సర్వీస్ ఛార్జీల రూపంలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. 2018-19లో రూ.72 కోట్లు వసూలు చేయగా 2019-20లో గరిష్ఠంగా రూ.158 కోట్లు కలెక్ట్ చేసింది. దేశంలో రెండో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా 2015-20 వరకు 3.9 కోట్ల జీరో బ్యాలెన్స్ బీఎస్బీడీ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు చార్జీల కింద వసూలు చేసింది.
మరోవైపు ఆర్బీఐ నిబంధనలను ఎస్బీఐ క్రమబద్ధంగా ఉల్లంఘించిందని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ ఆశిష్ దాస్ చేపట్టిన ఈ అధ్యయనం ఆరోపించింది. బీఎస్బీడీఏ ఖాతాలకు సంబంధించి నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీకి రూ. 17.70 చొప్పున వసూలు చేయాలని ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం సహేతుకం కాదని పేర్కొంది.
బీఎస్బీడీ ఖాతాలపై ఛార్జీలు వసూలు చేయడంపై 2013 సెప్టెంబర్లో ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం పేదలకు చెందిన బీఎస్బీడీ ఖాతాలకు నెలలో నాలుగు కంటే ఎక్కువ విత్ డ్రాలకు సంబంధిత బ్యాంకులు తమ అభీష్టం మేరకు అనుమతించవచ్చు.
అయితే ఎస్బీఐతోపాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐ జారీ చేసిన ఈ నిబంధనను పక్కనపెట్టాయి. నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలకు కూడా దీనిని వర్తింపజేస్తున్నాయని ఐఐటీ బాంబే నిర్వహించిన పరిశీలనలో తేలింది.