ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు కరోనా వేళ వినూత్నంగా సేవలందించేందుకు ముందుకు వస్తున్నది. తాజాగా ఇంటి వద్దకే బ్యాంకింగ్ ఫెసిలిటీ కల్పిస్తుంది.
శాఖలు, ఏటీఎంల వద్ద పలు సేవలను అందుబాటులోకి తెచ్చిన ఎస్బీఐ.. తాజాగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చింది. అంటే, ఇంటి వద్ద నుంచే ఖాతాదారులు తమకు అవసరమైన నగదు కోసం ఆర్డర్ చేయొచ్చు.
ఈ డోర్ స్టెప్ డెలివరీ సేవలను కొన్ని ఎంపిక చేసిన శాఖల పరిధిలోనే అందుబాటులో ఉంచింది ఎస్బీఐ. ఈసేవల్లో క్యాష్/చెక్ పికప్ సేవలు పొందొచ్చు. చెక్లు పొందేందుకు స్లిప్ పికప్, ఫామ్ 15 హెచ్ పికప్, డ్రాఫ్ట్ల డెలివరీ, లైఫ్ సర్టిఫికెట్ పికప్, కేవైసీ డాక్యుమెంట్ల పికప్ వంటి సేవలు ఇందులో ఉన్నాయి.
ఎస్బీఐ బ్యాంక్ క్యాష్ డెలివరీ ఫెసిలిటీని ఉపయోగించుకునే ముందు ఖాతాదారులు తెలుసుకోవాల్సిన అంశాలివే..
ప్రస్తుతానికి ప్రతి రోజూ రూ.20 వేల వరకే నగదు విత్ డ్రాయల్ లేదా డిపాజిట్ పరిమితి విధించింది. పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వీస్ రిక్వెస్ట్ చేయొచ్చు.
హోం బ్రాంచ్ నుంచి మాత్రమే ఖాతాదారులకు సేవలందుతాయి. క్యాష్ డెలివరీ సర్వీసులను పొందాలంటే ఖాతాదారు కేవైసీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
క్యాష్ డెలివరీ లేదా డిపాజిట్ చేస్తే రూ.100 పై చిలుకు జీఎస్టీ చెల్లించాలి. క్యాష్ ఆర్డర్ ఎట్ హోం సేవల కోసం మీరు 1800111103 ఫోన్ నంబర్కు కాల్ చేయాలి.
హోం బ్రాంచ్కు ఐదు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో ఉన్న ఖాతాదారులకు మాత్రమే ఈ సేవలు లభిస్తాయి. పాస్బుక్ లేదా చెక్ బుక్ ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.