న్యూఢిల్లీ, మే 26: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ ఖాతాదారులపై ఈ ఏడాది జూలై 1 నుంచి సర్వీస్ చార్జీల భారం పెంచనున్నది. పరిమితికి మించి నగదును ఉపసంహరించినా, చెక్ బుక్కులు కావాలన్నా అదనంగా చెల్లించుకోవాల్సిందే. ఈ మేరకు సర్వీస్ చార్జీలను సవరించింది. అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల (బీఎస్బీడీ) ఖాతాదారులకే ఇవి వర్తిస్తాయి.
ఏటీఎం విత్డ్రా చార్జీలు
బీఎస్బీడీ ఖాతాదారులు.. ఏటీఎంల నుంచి నెలకు నాలుగుసార్ల కంటే ఎక్కువగా నగదును తీసుకుంటే ఒక్కో లావాదేవీపై రూ.15 చెల్లించాల్సి (జీఎస్టీ అదనం) ఉంటుంది. నెలకు తొలి 4 విత్డ్రాయల్స్ మాత్రమే ఉచితమని తెలిపింది.
బ్రాంచీల్లో విత్డ్రా చార్జీలు
ఏటీఎంలతోపాటు ఎస్బీఐ శాఖల్లోనూ నగదు విత్డ్రాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే. మొదటి నాలుగు నగదు ఉపసంహరణలే ఉచితమని, ఆ తర్వాత చార్జీలు తప్పవని తాజాగా బ్యాంక్ వెల్లడించింది. ప్రతిసారి రూ.15, జీఎస్టీ చెల్లించాల్సిందే.
చెక్ బుక్ చార్జీలు
చెక్ బుక్కుల జారీ నిబంధనలనూ ఎస్బీఐ సవరించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్కులనే ఉచితంగా అందిస్తామని స్పష్టం చేసింది. మరో 10 చెక్కులు కావాలంటే రూ.40 (జీఎస్టీ అదనం) ఇచ్చుకోవాల్సిందే. ఒకవేళ 25 చెక్కులు కలిగిన బుక్కును కోరితే బీఎస్బీడీ ఖాతాదారులు రూ.75 (జీఎస్టీ అదనం) ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అత్యవసర చెక్ బుక్కు కోసం వచ్చినవారిపై 10 చెక్కుల నిమిత్తం రూ.50ని వసూలు చేయనున్నారు. అయితే ఈ చార్జీల నుంచి వృద్ధులకు ఎస్బీఐ మినహాయింపునిచ్చింది.