ముంబై, ఏప్రిల్ 27: ఏడాదంతా భయం.. భయంగానే సాగింది. ఎక్కువ రోజులు లాక్డౌన్లు, ఆంక్షలే. అయినా గృహస్తుల పొదుపు మాత్రం పట్టాలు తప్పలేదు. పైగా గతంతో పోల్చితే మరింత పెరిగింది. 2020లో దేశ జీడీపీలో గృహస్తుల సేవింగ్స్ 22.5 శాతానికి ఎగిసింది. 2019లో ఇది 19.8 శాతంగానే ఉండటం గమనార్హం. ఈ మేరకు ప్రముఖ బ్రోకరేజీ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ఒకటి స్పష్టం చేసింది. అయితే గృహస్తుల భౌతిక పొదుపు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీలో 5.8 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ అమల్లో ఉన్నది ఈ మూడు నెలల్లోనే అన్న విషయం తెలిసిందే. కాగా, అక్టోబర్-డిసెంబర్లో 13.7 శాతానికి పెరిగింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాల ప్రకారం గృహస్తుల ఆర్థికేతర పొదుపు గతేడాది ఏప్రిల్-జూన్లో జీడీపీలో 21.4 శాతంగా నమోదైంది. జూలై-సెప్టెంబర్లో 10.4 శాతంగా ఉన్నది. కరోనాకు ముందున్న ఇదే త్రైమాసికాల్లో 7-8 శాతంగానే ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే అక్టోబర్-డిసెంబర్లో 8.4 శాతానికి దిగజారినట్లు పేర్కొన్నది.