న్యూఢిల్లీ : దేశంలో కరోనా థర్డ్ వేవ్ తలెత్తని పక్షంలో భారత్ రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే ఊపుతో తదుపరి ఏడాది సైతం వృద్ధి రేటు పరుగులు పెడుతుందని అన్నారు. ఎగుమతులు ఊపందుకున్నాయని, విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని, విదేశీ మారకద్రవ్యాలు ఆల్టైం హైకి చేరడం వంటి సానుకూల పరిణామాలు వృద్ధికి దోహదపడతాయని అంచనా వేశారు.
ధరల పెరుగుదల ఆందోళన రేకెత్తిస్తున్నా అవి అదుపుతప్పలేదని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే మనం వృద్ధి రేటును వేగవంతం చేసేలా చర్యలు చేపట్టేందుకు సరైన దశలో ఉన్నామని ఓ వార్తాచానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
కరోనా కట్టడికి విధించిన మొదటి లాక్డౌన్తో దెబ్బతిన్న దేశ ఆర్ధిక వ్యవస్ధ క్రమంగా కుదురుకుంటున్న సమయంలో రెండో వేవ్ తలెత్తినా దేశవ్యాప్త లాక్డౌన్ విధించకపోవడంతో ప్రభావం పరిమితంగానే ఉందని అన్నారు. లాక్డౌన్ నియంత్రణల నుంచి పలు రంగాలు బయటపడటంతో వినియోగదారుల నుంచి డిమాండ్ అనూహ్యంగా పుంజుకోవడం సానుకూల సంకేతాలు పంపుతోందని అన్నారు.