న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరైన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఉద్యోగుల జీతాలను పెంచే దిశగా కార్పొరేట్లు యోచిస్తున్నట్లు డెలాయిట్ సర్వే తెలిపింది. ఈ క్రమంలోనే 2022లో ఉద్యోగుల వేతనాలు 8.6 శాతం మేర పెరిగే వీలుందని చెప్పింది. ఈ ఏడాది 92 శాతం దేశీయ కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు సగటున 8 శాతం వేతన పెంపునిచ్చాయి. గతేడాది 4.4 శాతంగానే ఉన్నది. కేవలం 60 శాతం కంపెనీల్లోనే జీతాలు పెరిగాయి. కొవిడ్-19 కారణంగా 2020లో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కఠిన లాక్డౌన్ను అమలు పర్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది పరిస్థితులు చక్కబడటంతో వచ్చే ఏడాది ఉద్యోగుల జీతాలను సగటున 8.6 శాతం పెంచేందుకు కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తమ రెండో ‘వర్క్ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ సర్వే 2021’లో డెలాయిట్ పేర్కొన్నది. ఇది కరోనాకు ముందున్న ఇంక్రిమెంట్కు అద్దం పడుతున్నది.
భారీ హైక్లు
సర్వేలో పాల్గొన్న 25 శాతం కంపెనీలు.. తమ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతామని చెప్పినట్లు డెలాయిట్ తెలిపింది. సగటున 10-15 శాతం పెంపునిస్తామన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఈ సర్వేలో 7 రంగాలు, 24 ఉప రంగాలకు చెందిన 450కిపైగా సంస్థలు పాల్గొన్నాయి. ఇక నైపుణ్యం, పనితీరు ఆధారంగా దాదాపు మరో 1.8 రెట్లు ఎక్కువగా జీతాలను ఉద్యోగులకు ఇస్తామని కార్పొరేట్లు స్పష్టం చేశారు.
ఐటీనే టాప్
ఉద్యోగులకు జీతాలను పెంచే సంస్థల్లో ఐటీ రంగమే ముందున్నది. ఆ తర్వాత లైఫ్ సైన్సెస్ రంగం ఉన్నట్లు డెలాయిట్ ఈ సందర్భంగా తెలియజేసింది. ఐటీ కంపెనీలతోపాటు కొన్ని డిజిటల్/ఈ-కామర్స్ సంస్థలూ తమ ఉద్యోగులకు పెద్ద ఎత్తున వచ్చే ఏడాది జీతాలను పెంచనున్నాయని చెప్పింది. అయితే కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన రిటైల్, ఆతిథ్యం, రెస్టారెంట్లు, మౌలిక, నిర్మాణ రంగ సంస్థల ఉద్యోగులకు కాస్త తక్కువగానే జీతాలు పెరగవచ్చన్నది.
నియామకాల దిశగా..
78 శాతం సంస్థలు ఉద్యోగ నియామకాలను మళ్లీ ప్రారంభించినట్లు పేర్కొన్నాయి. కరోనా దెబ్బకు మార్కెట్ మందగించిన నేపథ్యంలో కొత్త కొలువుల జోలికి కార్పొరేట్లు వెళ్లలేకపోయిన సంగతి విదితమే. అయితే పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తుండటంతో రిక్రూట్మెంట్లపై దృష్టి పెడుతున్నారు. ఇదిలావుంటే కరోనా దృష్ట్యా 60 శాతం సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్య బీమా పాలసీ కవరేజీలను పెంచాయన్నాయి. మరో 24 శాతం సంస్థలు జీవిత బీమా పాలసీలనూ అప్డేట్ చేసినట్లు చెప్పాయి.
ఎఫ్డీఐనే ప్రధానం
భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల మార్కును చేరడంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పాత్రే చాలా కీలకమని డెలాయిట్ సీఈవో పునిత్ రంజన్ అభిప్రాయపడ్డారు. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్ దేశాల్లో 1,200 మంది వ్యాపార, పారిశ్రామికవేత్తలతో చేసిన సర్వేలో ఐదింటా రెండు వంతులకుపైగా మంది భారత్లో మరిన్ని లేదా తొలిసారి పెట్టుబడులకు ఆసక్తి కనబర్చినట్లు తేలింది. దీంతో ఇప్పటికీ ఎఫ్డీఐలకు భారతే అత్యంత ఆకర్షణీయ కేంద్రంగా ఉందని పునిత్ అన్నారు. కరోనాతో ఎక్కువగా ప్రభావితమైనప్పటికీ భారత్పట్ల అంతర్జాతీయ వ్యాపార, పారిశ్రామికవేత్తల్లో ఉన్న ఆసక్తి తగ్గలేదన్నారు.