న్యూఢిల్లీ, జూన్ 11: స్టీల్ దిగ్గజం సెయిల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.3,469.88 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,647.52 కోట్ల లాభంతో పోలిస్తే 31 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.16,574.71 కోట్ల నుంచి రూ.23,533.19 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు కూడా రూ.11,682.12 కోట్ల నుంచి రూ.18,829.26 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. మరోవైపు, రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.80 తుది డివిడెండ్ను బోర్డు ప్రకటించింది.