న్యూఢిల్లీ: ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి.. కానీ వేతన జీవులకు భారీ నిధి క్రియేట్ చేయడం అంత తేలిక కాదు. నెల వారీగా కొద్ది మొత్తంలో పొదుపు చేయడం ద్వారా భారీ నిధి సమకూర్చుకోవచ్చు. అందుకు మార్గాలు ఉన్నాయి.. వాటిల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి.
రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ)లో కొద్ది మొత్తం పొదుపు చేయడం ద్వారా భారీ సొమ్ముతో కూడిన నిధిని సమకూర్చుకోవచ్చు. బ్యాంకులన్నీ దాదాపుగా రికరింగ్ డిపాజిట్ల స్కీమ్లను కొనసాగిస్తున్నాయి.
వాటిల్లో ఎస్బీఐ, పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్లు చేయడం వల్ల లభించే ప్రయోజనాలు తెలుసుకుందాం..
మీరు పెద్ద మొత్తంలో పొదుపు చేయడానికి రికరింగ్ డిపాజిట్ లేదా ఆర్డీ సాయ పడుతుంది. దీన్ని మీరు పిగ్గీ బ్యాంక్గా కూడా వాడుకోవచ్చు. ప్రతి నెలా శాలరీ రాగానే నిర్దిష్ట మొత్తం ఆర్డీ ఖాతాలో జమ చేయాలి.
మెచ్యూరిటీ టైం పూర్తయ్యాక భారీ మొత్తం మీ చేతికి వస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఆరు నెలల నుంచి 10 ఏండ్ల వరకు ఉంది.
ఎస్బీఐలో మీరు ఏడాది నుంచి 10 ఏండ్ల వరకు మదుపు చేయొచ్చు. గరిష్ఠంగా 5.4 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ వడ్డీరేట్లు అమలులో ఉన్నాయి.
మీరు ప్రతి నెలా కనీసం రూ.100 పొదుపు చేయాలి. గరిష్ఠంగా పొదుపు చేయడానికి లిమిట్ లేదు. చెక్ లేదా నగదు ద్వారా ఎస్బీఐలో ఆర్డీ ఖాతా ప్రారంభించొచ్చు. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా తెరవొచ్చు. ఎస్బీఐ ఆర్డీ పథకం గడువును బట్టి వడ్డీ ఖరారవుతుంది.
పోస్టాఫీసు తమ ఆర్డీ ఖాతాదారులకు 5.8% వడ్డీ రేటు అందిస్తున్నది. గత జనవరి నుంచి అమలులో ఉంది. పోస్టాఫీసులో ఐదేండ్ల వరకు మాత్రమే ఆర్డీ లభిస్తుంది. ఇందులో నగదుతోనే ఖాతా ప్రారంభించాలి.
ఆర్డీ తెరవడానికి సంబంధిత పోస్టాఫీసు శాఖను సంప్రదించాలి. కనిష్ఠంగా రూ.10 నుంచి ఖాతా ప్రారంభించొచ్చు. ఇందులోనూ గరిష్ఠ మదుపునకు పరిమితుల్లేవు. దీనికి వడ్డీరేటును ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
ఏడాది నుంచి రెండేళ్లలోపు గల డిపాజిట్లపై 4.9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. మూడేళ్లలోపు గడువు గల వాటిపై 5.1 శాతం, ఐదేండ్లలోపు డిపాజిట్లపై 5.3 శాతం, పదేండ్ల లోపు డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ లభిస్తుంది.
ఐదేండ్ల గడువు గల రికరింగ్ డిపాజిట్లపై పోస్టాఫీస్ 5.8 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తున్నది. గత ఏప్రిల్ నుంచి ఈ వడ్డీరేటు లభిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీరేటును ఖరారు చేస్తారు.
రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.40 వేల వరకు వడ్డీ మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు మినహాయింపు లభిస్తుంది.
ఒకవేళ మీరు పన్ను చెల్లించకపోతే ఇంత కంటే ఎక్కువ ఆదాయం వస్తే 10 శాతం టీడీఎస్ వసూలు చేస్తారు.