బడిలో ఉత్తమ బోధకుడు. మడిలో అత్యుత్తమ కర్షకుడు.అందరికీ విద్య అతని నినాదం. సమీకృత సేద్యం ఆయన విధానం.పాఠశాల, గోశాల రెండూ ‘రెండు కండ్లు’. నిజంగానే, ఏలిమి కుమారస్వామి మేలిమి మనిషి! పుట్టుకతో అంటుకున్న పోలియో మహమ్మారిని ఎదుర్కొంటూనే సొంతకాళ్లపై నిలబడ్డాడు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం జయగిరికి చెందిన కుమారస్వామి అందరికీ ఆదర్శం.
ఊరికి దూరంగా వ్యవసాయ బావివద్దే కుమారస్వామి నివాసం. ప్రశాంత వాతావరణం. కనుచూపు మేరలో పొలాలు. కావాల్సినంత పాడి. 250 గొర్రెలు, 8 గోవులు, 100 వరకు నాటు కోళ్లు. ఇదే తన ఆస్తి. ఊతకర్ర సాయంతో నడుస్తాడు. భార్య పావని సహకారంతో పనులన్నీ చక్కబెట్టేస్తుంటాడు. వ్యవసాయ పనులు, గోశాల నిర్వహణలో భార్యాభర్తలిద్దరూ సమవుజ్జీలే. నలుగురికి ఉపాధికూడా కల్పిస్తున్నారు. అక్కడ చెంగుచెంగున ఎగిరే గొర్రెపిల్లలు, లేగదూడలు ముచ్చట గొలుపుతాయి. ఆ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నిత్యం 30 లీటర్ల పాలు విజయ డెయిరీకి సరఫరా చేస్తుంటాడు. కులవృత్తిగా అబ్బిన గొర్రెల పెంపకంలో ఆధునికతను మేళ వించి మంచి లాభాలు పొందుతున్నాడు. వారసత్వంగా వచ్చిన భూమిలో వరి, మక్కజొన్న, వేరుశనగ వేస్తున్నాడు. సమీకృత సాగుతో రకరకాల పంటలు పండించే కుమారస్వామి ఇంట ధాన్యలక్ష్మి నిత్యం తాండవమాడుతుంది. ‘మినీ ఇంటెగ్రేటెడ్ ఫార్మింగ్’తో విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.
బడితీరు మార్చేసి..
తెల్లవారగానే పొలం పనుల్లో బిజీబిజీగా గడిపే కుమారస్వామికి వ్యవసాయం ప్రవృత్తి మాత్రమే. ఆయన అసలు వృత్తి విద్యాబోధన. ఇదే జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీసీకాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 2014లో బదిలీపై ఇక్కడికి వచ్చాడు. ఆయనతోపాటు నల్లాల రాజిరెడ్డికూడా బదిలీపై వచ్చాడు. వీరిద్దరూ వచ్చినప్పుడు, ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కేవలం 24. పిల్లలు తక్కువైతే పని తేలిక అనుకోలేదీ గురువులు. బడిపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించడానికి రోజూ అరగంట ముందే పాఠశాలకు వచ్చేవాళ్లు. పనివేళలు అయిపోయినా అదనంగా మరో గంట ఉండేవారు. పాఠాలు చక్కగా బోధించడమే కాదు, ఆసక్తికరమైన ఈవెంట్స్ నిర్వహిస్తూ పాఠశాలపై వారిలో మక్కువను పెంచారు.
నో అడ్మిషన్
కుమారస్వామి, రాజిరెడ్డి చొరవతో చుట్టుపక్కలవాళ్లు తమ పిల్లలను ఈ సర్కారీ స్కూలుకు పంపడం మొదలు పెట్టారు. కొన్నాళ్లకు బడిముందు ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం రెండు గదులే ఉన్న ఈ స్కూల్లోకి వరదలా వచ్చిన ఆడ్మిషన్లతో విద్యార్థుల సంఖ్య 126కు చేరింది. పిల్లలకు మంచివిద్య అందించే ఉద్దేశ్యంతో సొంత డబ్బు వెచ్చించి, ఇద్దరు విద్యా వలంటీర్లను నియమించారు. పాఠశాల ప్రగతి గురించి తెలుసుకున్న అధికారులు మరో ఇద్దరు టీచర్లను డిప్యుటేషన్పై పంపారు. ఈ బడిలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థులు సైతం ఇంగ్లిష్లో గడగడా మాట్లాడుతారు. ఇక్కడి విద్యార్థులను వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు కూడా! ఇప్పటి వరకు 14 మంది రెసిడెన్షియల్ స్కూళ్లలో సీట్లు సంపాదించారు.
ఉభయ తారకం
పనివేళల్లో బడి ఉన్నతికి శాయశక్తులా ప్రయత్నించే కుమారస్వామి, ఇంటికి చేరగానే మళ్లీ వ్యవసాయపనుల్లో నిమగ్నమవుతాడు. తాను ఎంతో పేదరికంలో పెరిగానని, కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించు కొన్నాననీ చెబుతారు. వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయ బావిదగ్గర నివాసం ఉంటున్నానని వెల్లడిస్తారు. సర్కారు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతకూడా అదే జీవనశైలిని పాటిస్తున్నాడు స్వామి. భర్త మనసెరిగిన భార్య పావని కూడా చక్కగా సహకరిస్తున్నది.
ఇద్దరి సహకారంతో..
నేను ఉపాధ్యాయునిగా, రైతుగా రాణిస్తున్నానంటే.. అదంతా మిత్రుడు రాజిరెడ్డి, నా భార్య పావని సహకారంతోనే సాధ్యమైంది. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. పచ్చని పొలాలమధ్య గడపడంలోనే నాకు ఆనందం ఉంది. అందుకే, బావి దగ్గరే ఉంటున్నా. పశువుల పెంపకంలో ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా నిలదొక్కుకున్నా. ఇంజినీరింగ్ చదివిన పిల్లలు కూడా నా అభిప్రాయానికి
విలువ ఇస్తున్నారు.
-ఏలిమి కుమారస్వామి
-కొన్నె దేవేందర్రెడ్డి