న్యూఢిల్లీ, మార్చి 10: దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2024 నాటికి 111 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల 10,300 కోట్లు)కు చేరవచ్చని ఫిన్టెక్ సంస్థ ఎఫ్ఐఎస్ అంచనా వేసింది. బుధవారం విడుదలైన ఎఫ్ఐఎస్ 2021 గ్లోబల్ పేమెంట్స్ నివేదిక ప్రకారం కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీస్ వినియోగం బాగా పెరిగినట్లు తేలింది. కొవిడ్-19 దృష్ట్యా భారత్సహా ప్రముఖ దేశాల్లో చెల్లింపుల్లో ఎన్నో కొత్త మార్పులు వచ్చాయన్నది. ఈ క్రమంలోనే 2020లో దాదాపు 60 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతీయ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2024లో 111 బిలియన్ డాలర్లకు చేరవచ్చన్నది. రాబోయే నాలుగేండ్లలో 84 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేసింది. ఇక భారత్లో ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి’ ఆఫర్లు ప్రజాదరణను పొందాయని, భవిష్యత్తులోనూ ఇవి మరింత కస్టమర్లను ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా ఎఫ్ఐఎస్ పేర్కొన్నది.
దేశంలో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మార్కెట్ ఇప్పటితో పోల్చితే 2024 నాటికి 41 శాతం వృద్ధి చెంది 1,035 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఎఫ్ఐఎస్ అంచనా వేసింది. కాగా, దుకాణాల్లో ఇంకా నగదు చెల్లింపులే అధికమని, 34 శాతంగా ఉన్నాయన్న ఎఫ్ఐఎస్.. ఆ తర్వాత డిజిటల్ వాలెట్లు (22 శాతం), డెబిట్ కార్డ్ చెల్లింపులు (20 శాతం) ఉన్నాయన్నది. అయితే 2024కల్లా డిజిటల్ వాలెట్ల వాటా 33 శాతానికి ఎగబాకవచ్చని అంచనా వేసింది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ-కామర్స్ మార్కెట్ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నదని, చైనాలో విపరీతంగా పెరుగుతున్నదని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల్లో సర్వే
నేటి, భవిష్యత్ చెల్లింపులపై అధ్యయనం
గతేడాది పెరిగిన డిజిటల్ వాలెట్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్ల వినియోగం
2024 నాటికి ఆన్లైన్ చెల్లింపుల్లో డిజిటల్ వాలెట్ల వాటా 47 శాతానికి
ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఏటా 13% చొప్పున ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధి
రాబోయే నాలుగేండ్లలో మొబైల్ షాపిం గ్ వార్షిక వృద్ధి 21 శాతంగా అంచనా
‘కరోనా నేపథ్యంలో భారతీయ ఈ-కామర్స్ పరిశ్రమ భారీగా పుంజుకున్నది. భవిష్యత్తులోనూ గణనీయమైన వృద్ధిని సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్ యాప్స్ ద్వారా షాపింగ్కు అలవాటుపడుతున్నారు. వ్యాపారులు సైతం డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్నారు’
-ఫిల్ పాంఫర్డ్, ఎఫ్ఐఎస్ ఆసియా-పసిఫిక్ వరల్డ్పే ఎండీ