Karvy Shares Freeze | మనీ లాండరింగ్ కింద కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు (Freeze) చేసింది. ఈ విషయమై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలను ఉల్లంఘించి తమ వద్ద తీసుకున్న రుణాలను చెల్లించలేదంటూ కార్వీ సంస్థపై బ్యాంకులు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యాంకుల వద్ద ఇన్వెస్టర్ల షేర్లను తాకట్టు పెట్టి కార్వీ సంస్థ రుణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బ్యాంకుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కార్వీ చైర్మన్ పార్ధసారధిని అరెస్ట్ చేసి విచారించారు. బ్యాంకుల వద్ద రూ.2700 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కార్వీ చైర్మన్ పార్ధసారధి తదితరులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పార్ధసారధి కస్టడీ కోసం మూడు రాష్ట్రాల పోలీసులు కసరత్తు చేస్తున్నారు.