న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఇటీవల ప్రకటితమైన జాతీయ వాహన తక్కు విధానంతో ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని, ఉపాధి కల్పన పెరుగుతుందని కేంద్ర రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కాలంచెల్లి, కాలుష్యాన్ని వెదజల్లే పాత వాహనాల్ని కొత్తవాటితో భర్తీచేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోది గతవారం ఈ విధానాన్ని ప్రకటించారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, దీంతో కొత్త వాహన విక్రయాలు పెరుగుతాయని, తద్వారా కేంద్రం, రాష్ర్టాలకు రూ.40,000 కోట్ల జీఎస్టీ లబ్ది కలుగుతుందని గడ్కరీ తెలిపారు. తక్కుగా మార్చిన వాహనాలస్థానంలో కొత్తవాటిని కొనుగోలుచేసేవారికి 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలంటూ ఆటోమొబైల్ కంపెనీలను కోరామని ఆయన పేర్కొన్నారు.
టెస్టింగ్, స్క్రాపింగ్ సెంటర్లు ఏర్పాటు&
తుక్కు విధానాన్ని అమలుజరిపేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను (ఏటీఎస్), రిజిష్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటు చేస్తున్నామని, మరో 26 ఏటీఎస్లను మంజూరుచేశామని, తొలిదశలో 75 స్టేషన్లను నెలకొల్పనున్నట్లు ఆయన వివరించారు. వీటి సంఖ్యను తదుపరి 450-500కు పెంచుతామన్నారు. ఆర్వీఎస్ఎఫ్లు పర్యావరణానికి హానికలగని రీతిలో వాహనాల్ని తుక్కుగా మారుస్తాయని, వచ్చే నాలుగైదేండ్లలో దేశవ్యాప్తంగా 50-70 ఆర్వీఎస్ఎఫ్ల్ని నెలకొల్పుతామన్నారు. ఆర్వీఎస్పీ ఏర్పాటుకోసం దరఖాస్తుల్ని సింగిల్విండో క్లియరెన్స్ పోర్టల్ ద్వారా ప్రాసెస్చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి 60 రోజుల్లోపు అనుమతుల్ని మంజూరుచేస్తాయని గడ్కరీ తెలిపారు.