కంపెనీ ఎండీ అశోక్ గుప్తా వెల్లడి
హైదరాబాద్, మార్చి 4: కమర్షియల్ కోల్డ్ చెయిన్ వస్తువుల తయారీ సంస్థ రాక్వెల్… వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. కరోనా వైరస్తో కోల్డ్ చెయిన్ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కంపెనీ తాజాగా తొలి కొవిడ్-19 వ్యాక్సిన్ ఫ్రీజర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్రీజర్ను రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా మాట్లాడుతూ..మార్కెట్లో కోల్డ్ చెయిన్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరో రూ.100 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో మేడ్చల్ వద్ద ఉన్న ప్లాంట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతోపాటు వ్యాపారాన్ని ఇతర రాష్ర్టాలకు విస్తరించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్(ఎన్ఐపీఈఆర్) సర్టిఫై చేసిన ఈ ఫ్రీజర్ విద్యుత్ లేకుండా పనిచేయనున్నది. ప్రస్తుతం ఫ్రీజర్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని రోజుకు వెయ్యి యూనిట్ల నుంచి 2 వేల యూనిట్లకు పెంచనున్నట్లు చెప్పారు. రూ.40 వేలు మొదలుకొని రూ.2.5 లక్షల మధ్యలో ఈ ఫ్రీజర్లు లభించనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్లలో అస్ట్రా జెనెకా, స్పుత్నిక్ వ్యాక్సిన్లను స్టోరేజ్ చేయాలంటే 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఈ ఏడాది రూ.25 కోట్ల విలువైన ఆర్డర్లను లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. వచ్చే ఏడాది చివరినాటికి రూ.50 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.