హైదరాబాద్, అక్టోబర్ 20: ఫ్రెంచ్నకు చెందిన సానిటరీ ఉత్పత్తుల సంస్థ రోకా..భారత్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశీయంగా తన ఉత్పత్తులను మార్కెట్లో మరింత ప్రచారం నిర్వహించడానికి ఏడు స్టూడియోలను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా హైదరాబాద్లో తన స్టూడియోను నెలకొల్పడానికి సిద్ధమైంది. వచ్చే మూడు నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ స్టూడియోను 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నది. ఈ స్టూడియోలో రోకాతోపాటు పారివేర్కు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తుల్లో ముఖ్యంగా బాత్రూంనకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులతోపాటు పైపులు, సానిటైజర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కేఈ రంగనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రీమియం బాత్రూం ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ స్టూడియోను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సానిటరీ ఉత్పత్తులుకు డిమాండ్ నెలకొన్నదని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకోవడం ఇందుకు దోహదం చేస్తున్నదన్నారు.
రూ. 1800 కోట్ల ఆదాయం..
ప్రతియేటా రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్న సంస్థ.. దీంట్లో రూ.50 కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ప్లాంట్లలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ఖర్చు పెట్టనుండగా, మరో రూ.50 కోట్లను మార్కెటింగ్ కోసం ఖర్చుచేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతేడాది ఇప్పటి వరకు రూ. 1,800 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ.. గత రెండేండ్లుగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. అలాగే దేశవ్యాప్తంగా సంస్థకు ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయి.