స్థిరాదాయ పథకాలు
మధ్య తరగతి మదుపరులంతా పెట్టుబడికి నష్టం రాకుండా స్థిరంగా రాబడి రావాలని కోరుకుంటారు. రిస్క్ అసలే ఉండకూడదనుకుంటారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా అన్ని సమయాల్లోనూ నిలకడగా, స్థిరంగా ఆదాయాన్నిచ్చే మదుపు పథకాల వైపు మధ్య తరగతితోపాటు రిటైర్మెంట్ కోసం ప్లానింగ్ చేసుకోవాలనుకునేవారు మొగ్గుచూపుతారు. అలాంటి ఐదు అత్యుత్తమ పథకాల గురించి తెలుసుకుందాం.
అత్యంత విశ్వసనీయ పొదుపు మార్గం.. చాలామంది సంకోచం లేకుండా మదుపు చేయడానికి ముందుకు వచ్చే పథకం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). అన్ని రకాల పన్ను మినహాయింపులు వర్తించే పీపీఎఫ్లో ఈ ఏడాది నుంచి 6.4 శాతం వడ్డీ రాబడి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం 80సీ సెక్షన్ కింద దాదాపు లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. బ్యాంకులో లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతాను రూ.100తో తెరవచ్చు. కనీసంగా రూ.500లు కూడా మదుపు చేయవచ్చు. దీనికి మొదట 15 ఏండ్ల కాలపరిమితి, ఆ తర్వాత ఐదేండ్ల చొప్పున మెచ్యూరిటీ సమయాన్ని పెంచుకోవచ్చు. అయితే ఏడో సంవత్సరం నుంచి మదుపును పాక్షికంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే పీపీఎఫ్ మదుపును హామీగా ఇస్తూ రుణ సదుపాయాన్ని పొందవచ్చు. అత్యుత్తమ రిటైర్మెంట్ ప్రణాళికలో ఉండదగిన పథకం ఇది. ఏటా లక్ష రూపాయలను మదుపు చేస్తే 15 ఏండ్ల తర్వాత దాదాపు రూ.40 లక్షలపైనే వచ్చే అవకాశం ఉంది. 20 ఏండ్లపాటు మదుపు చేస్తే రూ.70 లక్షలపైనే రావచ్చు.
ఈ చిన్న మొత్తాల పథకానికి భారత ప్రభుత్వం హామీ ఉంటుంది. కనీసంగా రూ.100 నుంచి ఎంత మొత్తాన్నైనా మదుపు చేయవచ్చు. ఐదేండ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఏటా 5.9 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. దీనికి కూడా సెక్షన్ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపును పొందవచ్చు. ఏటా వచ్చే వడ్డీని అసలు డిపాజిట్ మొత్తానికి కలుపుతారు. దీంతో వడ్డీ రాబడులకు కూడా పన్ను మినహాయింపును పొందవచ్చు. ఐదేండ్ల మెచ్యూరిటీకి ముందు కూడా పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఏడాదిలోపు తీసుకుంటే ఎలాంటి రాబడి లేకుండా కేవలం మదుపు మొత్తాన్నే ఇస్తారు.
ఆడ పిల్లలున్నవారెవరైనా మదుపు చేయదగిన పథకం ఇది. విద్య, వివాహాల కోసం రూపొందించిన పథకం ఇది. దీని మీద పీపీఎఫ్, ఎన్ఎస్ఎస్లకన్నా అధికంగా 6.9 శాతం వడ్డీ వస్తుంది. ఆడపిల్లల పేరిట పదేండ్ల వయసులోపు ఎప్పుడైనా ఇందులో మదుపు చేయవచ్చు. ప్రభుత్వ బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఖాతా తెరవచ్చు. అమ్మాయి 21 ఏండ్ల వయసు రాగానే పథకం గడువు ముగుస్తుంది. 18 ఏండ్ల వయసు విద్య, సీరియస్ అనారోగ్యం వంటి వాటి కోసం పాక్షికంగా మదుపును వెనక్కి తీసుకోవచ్చు. దీనికి కూడా భారత ప్రభుత్వ హామీ ఉంటుంది. పూర్తి పన్ను మినహాయింపులు కూడా వర్తిస్తాయి.
ఇవి మ్యూచువల్ ఫండ్లు. రిస్కు బాగా తక్కువగా ఉండి మోస్తరు రాబడులను ఇస్తాయి. లిక్విడిటీ ఎక్కువ. స్వల్ప కాలిక డెట్ సెక్యూరిటీల్లో మదుపు చేస్తాయి. కొన్ని రోజులకు కూడా వీటిలో మదుపు చేయవచ్చు. కాస్త ఎక్కువ కాలం మదుపు చేస్తే పీపీఎఫ్, ఎన్ఎస్సీ కంటే ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఆదాయ పన్ను మినహాయింపును పొందాలంటే కనీసం మూడేండ్ల కాల పరిమితికి మదుపు చేయాలి. డిజిటల్ చెల్లింపుల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ కార్పొరేట్లు నిధుల సమీకరణకు జారీచేసే సాధనాలే బాండ్లు. వీటిని కూడా నేరుగా కొనుగోలు చేయవచ్చు. కొన్ని బాండ్లను స్టాక్ ఎక్స్చేంజీల్లో కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వ బాండ్లు, ‘ట్రిపుల్-ఏ’ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలో రిస్క్ తక్కువ.