న్యూఢిల్లీ : ఇంధన ధరల పెరుగుదలతో ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాహనాలకు డిమాండ్ దెబ్బతినడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి పరుగులు పెడుతుండటం ఆటోమొబైల్ పరిశ్రమపై పెను ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఇంధన ధరలు వీలైనంత త్వరలో దిగివస్తేనే పరిశ్రమ బాగుపడుతుందని ఎస్ఐఏఎం ప్రెసిడెంట్ కెనిచి ఆయుకవ పేర్కొన్నారు.
ఇంధన ధరలు రికార్డు స్ధాయికి చేరడంతో ప్రజలు సహజంగానే వాహనాల వాడకంపై విముఖత చూపుతారని ఆయన వ్యాఖ్యానించారు. పెట్రో ధరల తాకిడికి వాహన విక్రయాలు ఏస్ధాయిలో పడిపోతాయనేది ఎస్ఐఏఎం ప్రస్తుతం అంచనా వేయలేదని చెప్పారు. ఇంధన ధరల దూకుడు తమకు సమస్యగా ముందుకొచ్చిందని చెప్పారు. ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారీ డిమాండ్ మందగించడం చూస్తామని అన్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో సరుకు రవాణా వ్యయం పెరిగి అన్ని వస్తువుల ధరలు ఎగబాకడంతో ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చే పరిస్థితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.