న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహాన్ని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 2తో పోలిస్తే ఇటీవల రోజూ ప్రజలకు వేసే వ్యాక్సిన్ల సంఖ్య తగ్గుతోందనే డేటాను చిదంబరం ఆదివారం ట్వీట్ చేశారు.
ఏప్రిల్ 2న రోజుకు 42 లక్షల వ్యాక్సిన్ డోసులు వేస్తే శుక్రవారం ఆ సంఖ్య 11.6 లక్షలకు పడిపోయిందని, ప్రతి రోజూ వ్యాక్సినేషన్ సంఖ్యలు ఎందుకు తగ్గుతున్నాయని ప్రశ్నించారు. వ్యాక్సిన్ల కొరతతోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించగా ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత లేదని చెబుతున్నారని చిదంబరం ఎద్దేవా చేశారు.