Gold Best returns | బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం.. ఏటేటా బంగారానికి డిమాండ్ శరవేగంగా పెరగడమే దీనికి నిదర్శనం. కరోనా కష్టాలు వెంటాడుతున్నా.. 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) జూన్ త్రైమాసికంలో బంగారానికి డిమాండ్ 19.2 శాతం పెరిగింది. ఈ పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన టైం. మున్ముందు బంగారంపై పెట్టుబడులకు మంచి లాభాలు ఉంటాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. గత ఐదేండ్లలో బంగారంపై పెట్టుబడులకు 56 శాతం రిటర్న్స్ లభించాయి. 2016 నుంచి బంగారంపై మదుపునకు ప్రతిఏటా 11శాతానికి పైగా లాభాలు వస్తున్నాయి. 2016 ఆగస్టులో తులం బంగారం ధర రూ.31 వేలు.. ఇప్పుడది రూ.48 వేలు పలుకుతున్నది.
గత 50 ఏండ్లలో బంగారం ధరలు 261 రెట్లు పెరిగాయి. 1970లో తులం బంగారం ధర రూ.184.. ఇప్పుడు అది రూ.48 వేల వద్ద లభిస్తున్నది. అంటే 50 ఏండ్ల క్రితంతో పోలిస్తే 261 రెట్లు పెరిగిందన్న మాట.
కరోనాతో దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతేడాది ఆగస్టులో పది గ్రాముల బంగారం ధర రూ.56,200తో ఆల్టైం రికార్డు పలికింది. గత మార్చిలో తులం బంగారం రూ.43 వేలకు పడిపోయినా.. తిరిగి ఇప్పుడు రూ.48 వేలకు చేరుకున్నది.
వచ్చే ఐదేండ్లలో తులం బంగారం ధర రూ.లక్ష వరకు దూసుకెళ్లొచ్చునని స్పెయిన్ క్వాడ్రిగా ఫండ్ అంచనా వేస్తున్నది. వచ్చే మూడు నుంచి ఐదేండ్లలో ఔన్స్ బంగారం ధర 3000-5000 డాలర్లు పలుకుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే దేశీయంగా తులం బంగారం రూ.78,690-1,31,140 వరకు వెళ్లొచ్చు.
ఎకానమీ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా చెప్పారు. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోకపోతే బంగారంపై పెట్టుబడులకు అధిక లాభాలు గడించొచ్చునని పేర్కొన్నారు. ఎకానమీ నెమ్మదిగా సాగితే మాత్రం తులం బంగారం ధర ఏడాది లోపు రూ.60 వేల మార్క్ను చేరొచ్చు. అయితే, కరోనా మహమ్మారి ప్రభావం పెద్దగా ఉండకపోతే బంగారంపై ఆశలు పెట్టుకోవద్దని ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు.
ప్రతియేటా భారత్లో బంగారం 700-800 టన్నుల వినియోగం జరుగుతున్నది. ఇందులో ఒక టన్ను మాత్రం దేశీయంగా ఉత్పత్తవుతున్నది. మిగతా మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. 2020లో మాత్రం 344.2 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయ్యింది. ఇది 2019తో పోలిస్తే 47 శాతం తక్కువ. 2019లో 646.8 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నారు. పరిమితంగా అంటే 10-15 శాతం పెట్టుబడులు మాత్రమే బంగారంపై ఇన్వెస్ట్ చేయాలని ఐఐఎఫ్ఎల్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా .. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్
Neeraj Chopra: వందేళ్ల కల.. 23 ఏళ్ల కుర్రాడు సాకారం చేశాడు
Neeraj Chopra : నీరజ్ చోప్రా ఫిట్నెస్కు అతని బామ్మే కారణమట!