72 శాతం పుంజుకున్న అమ్మకాలు: రాయ్
న్యూఢిల్లీ, ఆగస్టు 17: రిటైల్ అమ్మకాలు దేశవ్యాప్తంగా కోలుకుంటున్నాయి. జూలైలోనూ వృద్ధి కనిపించగా, కరోనాకు ముందున్న స్థాయికి చేరువలో నమోదు కావడం విశేషం. 2019 జూలైతో పోల్చితే ఈ ఏడాది జూలైలో రిటైల్ సేల్స్ 72 శాతానికి పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) మంగళవారం తెలిపింది.
అంతకుముందు నెల జూన్లో రికవరీ రేటు 50 శాతాన్ని తాకిందని గుర్తుచేసింది. కాగా, దక్షిణాది రాష్ర్టాల్లో అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్నాయని తమ తాజా వ్యాపార సర్వేలో తేలినట్లు ఈ సందర్భంగా రాయ్ వెల్లడించింది. గతంతో పోల్చితే 82 శాతం రికవరీ ఉన్నట్లు పేర్కొన్నది. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల వ్యాపారం 97 శాతం కోలుకోగా, దుస్తుల అమ్మకాలు 63 శాతం కుదుటపడ్డాయి.
అయితే ఇప్పటికీ సెలూన్ల వంటి వ్యాపారాలు 50 శాతానికే పరిమితమైయ్యాయి. ఈ క్రమంలోనే రాబోయే పండుగ సీజన్పై వ్యాపారులు పెద్ద ఎత్తునే ఆశలు పెట్టుకున్నారని రాయ్ చెప్పింది. ఇక మహారాష్ట్రలో కొనసాగుతున్న ఆంక్షలు.. రిటైల్ మార్కెట్ను దెబ్బతీస్తున్నాయని రాయ్ సీఈవో రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు.