న్యూఢిల్లీ, జూన్ 14: ద్రవ్యోల్బణం భగ్గుమన్నది. దేశంలో అటు హోల్సేల్ ధరలు, ఇటు రిటైల్ ధరలు రెండూ విజృంభించాయి. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం గత నెల 6 నెలల గరిష్ఠాన్ని తాకింది. మే నెలలో 6.3 శాతంగా ఉన్నట్లు సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, వంటనూనెల ధరలు పెరుగడంతో ఆహార ద్రవ్యోల్బణం 5.01 శాతంగా నమోదైంది. ఇంధన ధరలూ దీనికి కారణమైయ్యాయి. కాగా, ద్రవ్యోల్బణం కట్టడికి సంబంధించి ఆర్బీఐ లక్ష్యాన్ని దాటి తాజా గణాంకాలుండటంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు పెరిగే వీలుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
12.94 శాతంగా టోకు ద్రవ్యోల్బణం
టోకు ద్రవ్యోల్బణం మునుపెన్నడూ లేనివిధంగా మే నెలలో 12.94 శాతంగా నమోదైంది. భారీగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, తయారీ వస్తూత్పత్తుల వ్యయం.. హోల్సేల్ ధరల సూచీని పరుగులు పెట్టించాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, గతేడాది మే నెలలో మైనస్ 3.37 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం.. ఈ ఏడాది ఏప్రిల్లో రెండంకెల స్థాయిని తాకుతూ 10.49 శాతానికి చేరింది.