న్యూఢిల్లీ : ధరల మంటతో సామాన్యుడు తల్లడిల్లుతున్న వేళ కొంతమేర ఊరట లభించింది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 6.26 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గినా వరసుగా రెండవ నెల కూడా ఆర్బీఐ అంచనాలకు (రెండు నుంచి ఆరు శాతం) అధికంగానే ఉంది. మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.30 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం అదుపులోకి రానందున ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక రేట్లను వరుసగా ఆరోసారి యథాతథంగా ఉంచింది.
ఇక జూన్లో ఇంధన, ఆహోరోత్పత్తుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం ఎగబాకింది. గుడ్లు, వంట నూనెలు, పండ్లు, పప్పు ధాన్యాల ధరలు పెరిగాయి. ఇంధన ద్రవ్యోల్బణం 12.7 శాతానికి పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సరుకు రవాణా వ్యయం పెరిగింది. మరోవైపు మేలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 29.27 శాతం పెరుగుదల నమోదు చేసింది.