హైదరాబాద్: జులై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎస్సీ, మైనారిటీ గురుకులాలపై మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్లో సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థలు ప్రారంభంపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..’గురుకులాల ప్రవేశాలను త్వరగా పూర్తి చేయాలి. పాఠ్య, నోట్ పుస్తకాలు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికి టీకా వేయించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలి. విద్యాలయాల పరిసరాలు, తరగతి, వసతి గదులు, వంటశాలలు, బాత్రూంలు పరిశుభ్రంగా ఉండేట్లు చూడాలి. అవసరమైన మరమ్మతులు తొందరగా పూర్తి చేయండి. తరగతి, వసతి గదుల్లో గాలి, వెలుతురు చక్కగా వచ్చేట్లు చూడాల’న్నారు.
‘విద్యార్థులను ప్రతిరోజూ ఉదయం 20 నిమిషాల పాటు ఎండలో ఉంచాలి. రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు గాను వాము వాటర్ లో పచ్చి పసుపు కలిపి అందించాలి. పోషకాహారం అందేలా చూడాలి. డైట్ ధరల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పించాలి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని’ మంత్రి పేర్కొన్నారు.