సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా ఆపత్కాలంలో ఓ వైపు ఉచితంగా ఆహారం అందజేస్తూనే.. మరోవైపు శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టి ‘హెల్పింగ్ స్పాట్’ సంస్థ ఆదర్శంగా నిలుస్తుంది. కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు, భౌతిక దూరం ఎంత ముఖ్యమో.. మన ఇండ్లు, పరిసరాలు శానిటైజేషన్ చేయడం కూడా అంతే ముఖ్యమని, అలాంటి కార్యక్రమాన్ని ‘హెల్పింగ్ స్పాట్’ తీసుకొంది. ఉచితంగా శానిటైజేషన్ చేస్తూ వైరస్ విరుగుడుకు కృషి చేస్తుంది. 88866 86000 నెంబర్కు కాల్ చేస్తే చాలు ఆహారంతో పాటు ఇంటిని శానిటైజేషన్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం, ఈ డ్రైవ్ను హైదరాబాద్ మహా నగరంలో ప్రారంభించారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే మరింత సమర్ధవంతంగా విధులు నిర్వర్తించగలుగుతారనే ఉద్దేశంతో తొలుత కరోనా సేవలు అందించే వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ సంస్థ ఫౌండర్ భార్గవ్ తెలిపారు. స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారు ఫోన్ చేస్తే ఇంటిని ఎలాంటి హానికరం లేని శానిటైజేషన్తో శుభ్రం చేస్తామని తెలిపారు.
కరోనా కట్టడికి అందరూ కృషి చేస్తేనే మరో లాక్డౌన్ అవసరం ఉండదు. ప్రభుత్వం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వాటికి తోడుగా మా ఐటీ ఉద్యోగులమంతా మాకు తోచిన సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే మేం మా సంస్థ తరపున 34 వేల ఫుడ్ ప్యాకెట్లను అందించాం. ఇప్పుడు మిషన్ శానిటైజేషన్ డ్రైవ్ను ప్రారంభించాం. మా టీంలో 18 మంది సభ్యులు ఉంటారు. కాల్ చేసి అడ్రస్ చెబితే చాలు.. మేం వెళ్లి శానిటైజేషన్ చేస్తాం. అంతా ఉచితంగానే సేవలు అందిస్తాం. దయచేసి ఎవరైతే ఆర్థికంగా శానిటైజేషన్ చేసుకోలేని వారుంటారో వారే కాల్ చేయాలని విజప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏడు వృద్ధాశ్రమాలను శానిటైజేషన్ చేశాం. పీపీఈ కిట్స్ ధరించి కొవిడ్ నిబంధనలు పాటించి సేవలు అందిస్తున్నాం. – భార్గవ్, ఫౌండర్ – హెల్పింగ్ స్పాట్