ముంబై: గ్రీన్ ఎనర్జీ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పారు. గురువారం జరిగిన సంస్థ 44వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జామ్నగర్ గిగా కాంప్లెక్స్లో నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కోసం వచ్చే మూడేండ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు.
దీంతో ఆదానీ గ్రూప్ అధినేత గౌతం ఆదానీ, గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్లతో ముకేశ్ అంబానీ పోటీ పడనున్నారు. అయితే, ఇప్పటికే విద్యుత్ రంగంలో పట్టు కలిగి ఉన్న గౌతం ఆదానీ, ఎలన్ మస్క్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి రావచ్చునని భావిస్తున్నారు.
గ్రీన్ ఇన్షియేటివ్ ఆఫ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్కు సంబంధించి ఫ్యూచర్ టెక్నాలజీ, పార్టనర్ షిప్ల మీద అదనంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. 2030 నాటికి 100 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకున్నది.
భారత్తోపాటు ప్రపంచ ముఖచిత్రంపై పూర్తి స్థాయిలో కర్బన ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నది రిలయన్స్. ఇందుకోసం దేశంలోనే ఉత్తమ నిపుణులతో కలిసి న్యూ ఎనర్జీ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది.
గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తిని చేసేందుకు ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ, సోలార్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, బ్యాటరీ ప్లాంట్, ఫ్యూయల్ సెల్ మేకింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు.
కంపెనీ మొత్తం రెవెన్యూ రూ.5.40 లక్షల కోట్లుగా ఉంది. నిరంతరం కంపెనీ అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్నదని ముకేశ్ అంబానీ తెలిపారు. గతేడాది 75 వేల కొత్త ఉద్యోగాలు కల్పించింది రిలయన్స్.