ముంబై, జూన్ 24: క్లీన్ ఎనర్జీపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) దృష్టి పెట్టింది. రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో కొత్త ఇంధన వ్యాపారంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించింది. గురువారం ఇక్కడ జరిగిన సంస్థ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వాటాదారులతో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ సోలార్ తయారీ కేంద్రాల నిర్మాణం, ఎనర్జీ స్టోరేజీ కోసం బ్యాటరీ కర్మాగారం ఏర్పాటు దిశగా వెళ్తున్నట్లు ప్రకటించారు. ఫ్యూయెల్ సెల్ ఉత్పాదక ప్లాంట్తోపాటు గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ఎలక్ట్రోలైజర్ యూనిట్ను నెలకొల్పనున్నామని వెల్లడించారు.
సోలార్ పవర్ వైపు..
సోలార్ పవర్ వైపూ రిలయన్స్ పరుగులు మొదలయ్యాయి. 2030 నాటికి 100 గిగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యాన్ని సంతరించుకోవాలని చూస్తున్నది. ఇందుకోసం గ్రామాల్లో వికేంద్రీకృత కార్యకలాపాలు, రూఫ్టాప్ ఇన్స్టాలేషన్లను ఆధారం చేసుకోనున్నది. ఓ కార్బన్ ఫైబర్ ప్లాంట్ కోసం పెట్టుబడులనూ పెడతామని ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా, ప్రస్తుతం సంస్థ ఆదాయంలో దాదాపు 60 శాతం హైడ్రోకార్బన్ ఆధారిత ఇంధన కార్యకలాపాల ద్వారానే సమకూరుతున్నది. ఈ నేపథ్యంలో 2035 నాటికి కార్బన్ రహిత సంస్థగా ఆర్ఐఎల్ను నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. దీంతో విద్యుత్తుతోపాటు గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా వాహనాలు నడిచేలా కృషి చేస్తున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తి పెంపూ ఇందులో భాగమే.
ఆస్తుల నగదీకరణ, రైట్స్ ఇష్యూ, ఈక్విటీల అమ్మకం ద్వారా రూ.3,24,432 కోట్ల సమీకరణ
ఏడాది కాలంలో ఓ సంస్థ ఈ స్థాయి నిధుల సమీకరించడం అంతర్జాతీయ రికార్డు
ఈ ఏడాది సౌదీ ఆరామ్కోతో 15 బిలియన్ డాలర్ల డీల్ పూర్తికాగలదన్న ఆశాభావం
ఆర్ఐఎల్ బోర్డులోకి సౌదీ ఆరామ్కో చైర్మన్, పీఐఎఫ్ గవర్నర్ యాసిర్ ఓత్మన్ అల్-రుమయ్యన్
డీల్ పూర్తయితే సౌదీ ఆరామ్కో చేతికి ఆర్ఐఎల్ ఆయిల్-టు-కెమికల్ యూనిట్లలో 20 శాతం వాటా
‘నవీ ముంబైలోని మా క్యాంపస్లో ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు జియో ఇన్స్టిట్యూట్ సిద్ధమైంది. కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో అండర్గ్రాడ్యుయేట్స్, పోస్ట్గ్రాడ్యుయేట్స్ కోసం స్కాలర్షిప్లను రిలయన్స్ ఫౌండేషన్ ఇవ్వనున్నది. ఈ కరోనా సంక్షోభంలో మా ఉద్యోగులెవ్వరికీ జీతాలు, బోనస్లు, ఇతర ఏ రకమైన ప్రయోజనాలకు కోత పెట్టలేదు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆక్సిజన్, కొవిడ్ ఇన్ఫ్రా, అన్న సేవా, ఎంప్లాయ్ కేర్, వ్యాక్సిన్ సురక్ష అనే ఐదు మిషన్లను రిలయన్స్ ప్రారంభించింది’.
-నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్