న్యూఢిల్లీ, ఆగస్టు 6: రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ రిటైల్లు విలీనానికి కుదుర్చుకున్న రూ.24,731 కోట్ల లావాదేవీపై సుప్రీంకోర్టు నీళ్లుచల్లింది. ఈ డీల్ను వ్యతిరేకిస్తూ అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ కోర్టు నుంచి తెచ్చుకున్న ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ (ఈఏ) అవార్డును శుక్రవారం సుప్రీం సమర్థించింది. భారత చట్టాల ప్రకారం కూడా సింగపూర్ ఈఏ అమలు చేయవచ్చని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీహైకోర్టు సైతం ఇదే చెప్పగా దాని అమలును కోరుతూ అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే అమెజాన్కు అనుకూలంగా న్యాయమూర్తి తాజా తీర్పునిచ్చారు. విదేశంలో ఇచ్చిన ఈఏ భారత చట్ట ప్రకారం వర్తించబోదంటూ ఫ్యూచర్ గ్రూప్ కోర్టుల్లో వాదిస్తున్నది.
కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్లోని అన్లిస్టెడ్ కంపెనీ ఒకదానిలో అమెజాన్ 49 శాతం వాటా కొన్నది. కొద్ది సంవత్సరాల తర్వాత లిస్టెడ్ కంపెనీ అయిన ఫ్యూచర్ రిటైల్లో వాటాను కొనే హక్కుల్ని పొంది, అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్లో ఆ పెట్టుబడులు చేసింది. గతేడాది అక్టోబర్లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ రిటైల్ను విలీనం చేసేందుకు రిలయన్స్తో రూ.24,731 కోట్ల డీల్ను కిషోర్ బియాని కుదుర్చుకున్నారు. అమెజాన్ ఈ డీల్ను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం మొదలుపెట్టింది.
రిలయన్స్తో తమ లావాదేవీని పూర్తిచేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నామని ఫ్యూచర్ రిటైల్ తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఫ్యూచర్ రిటైల్ స్టాక్ ఎక్సేంజీలకు ఈ విషయం తెలిపింది. ఈ తీర్పు ఫ్యూచర్ రిటైల్-అమెజాన్ల వివాదంలో న్యాయాన్యాయాలపై కాదని, చట్టం అమలుకు సంబంధించినదని ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. చట్టపరంగా తమకు పలు మార్గాలున్నాయని కంపెనీ తెలిపింది. మరోవైపు సుప్రీంకోర్టును తీర్పును ఆహ్వానిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్తో కొనసాగుతున్న వివాదం&తాజా తీర్పుతో త్వరితంగా పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని అమెజాన్ వ్యక్తంచేసింది.