న్యూఢిల్లీ, జూలై 16: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. సెర్చ్ ఇంజన్ ప్లాట్ఫామ్ను నిర్వహిస్తున్న జస్ట్డయల్ ను టేకోవర్ చేస్తున్నది. జస్ట్ డయల్లో 40.95 శాతం వాటాను రూ.3,497 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆర్ఐఎల్ శుక్రవారం ప్రకటించింది. ఆర్ఐఎల్ సబ్సిడరీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) ఈ కొనుగోలు జరిపింది. సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కోసం పబ్లిక్కు ఓపెన్ ఆఫర్ జారీ చేయనున్నట్లు స్టాక్ ఎక్సేంజీలకు రిలయన్స్ తెలిపింది. ఓపెన్ ఆఫర్ తర్వాత జస్ట్ డయల్లో రిలయన్స్ వాటా 66.95 శాతానికి చేరుతుంది. తాము టేకోవర్ జరుపుతున్నప్పటికీ, జస్ట్ డయల్ ప్రస్తుత ఎండీ, సీఈవో వీఎస్ఎస్ మణి అదే పదవిలో కొనసాగుతారని రిలయన్స్ తెలిపింది. జస్ట్ డయల్ డాటా బేస్లో 3.04 కోట్ల లిస్టింగ్స్ ఉన్నాయని, ఒక్కో త్రైమాసికంలో సగటున 12.91 కోట్ల కన్జ్యూమర్ ట్రాఫిక్ ఉంటుందని, తమ పెట్టుబడుల ద్వారా జస్ట్డయ ల్ డాటాబేస్ అందుబాటులోకి వస్తుందని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ చెప్పారు. తాము అందించే ఉత్పత్తులు, సేవల లావాదేవీలు పెరగడానికి జస్ట్ డయల్ ఉపకరిస్తుందని వివరించారు. శుక్రవారం జస్ట్ డయల్ షేరు 3.4 శాతం క్షీణించి రూ.1,070 వద్ద ముగిసింది.