న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం జస్ట్ డయల్ లావాదేవీని పూర్తి చేసినట్టు రిలయన్స్ రిటైల్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం జస్ట్ డయల్లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)కు 40.98 శాతం వాటా ఉన్నది. రూ.3,497 కోట్ల డీల్లో భాగంగా ఈ ఏడాది జూలైలో రూ.10 ముఖ విలువ కలిగిన 1.31 కోట్ల (15.63 శాతం వాటా) జస్ట్ డయల్ ఈక్విటీ షేర్లను ఒక్కోదాన్ని రూ.1,020 చొప్పున రిలయన్స్ రిటైల్ దక్కించుకున్నది. ఈ క్రమంలో ఈ నెల 1న రూ.10 ముఖ విలువ కలిగిన మరో 2.12 కోట్ల (25.35 శాతం వాటా) ఈక్విటీ షేర్లను రూ.1,022.25 చొప్పున రిలయన్స్ రిటైల్కు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్పై కేటాయించేందుకు జస్ట్ డయల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జస్ట్ డయల్ తాజాగా స్పష్టం చేసింది.